
బాలికకు ఆర్థిక సాయం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్నకు వైద్య చికిత్స నిమిత్తం రూ.30 వేలు ఉడుత స్వచ్ఛంద సంస్థ అందజేసిందని పాప తండ్రి కంచర్ల రాజేష్ ఆదివారం తెలిపారు. సాక్షిలో ఏప్రిల్ 29న ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు శీర్షికకు స్పందించిన హైదరాబాద్కు చెందిన ఉడుత స్వచ్ఛంద సంస్థ సహకారం అందించిందన్నారు. సుమారు పన్నెండు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు అనడంతో దాతలపై ఆధారపడి ఉన్నామని రాజేష్ తెలిపారు.
ఆటో డ్రైవర్పై దాడి కేసు నమోదు
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ఆటో డ్రైవర్ను కొట్టడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ ఆదివారం చెప్పారు. పట్టణంలోని రాజులవీధికి చెందిన కాసాని సత్యనారాయణ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. టౌన్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలోని లాడ్జిలో దిగడానికి ఆటో మాట్లాడుకున్నాడు. మూడు లాడ్జిలు తిరిగిన తరువాత ఆటో దిగిపోవడంతో డబ్బులు అడగగా రూ.150 ఇచ్చాడు. మరో రూ. 50 ఇవ్వాలని సత్యనారాయణ అడగడంతో ఆతనిపై దాడిచేసి గాయపర్చి వెళ్లిపోయాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెహమాన్ చెప్పారు.
పేరిచర్లకు లయన్స్ ఇంటర్నేషనల్ అవార్డు
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్స్ అడ్మినిస్ట్రేటర్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు లయన్స్ ఇంటర్నేషనల్ స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ఉప గవర్నర్ విజయ్కుమార్ రాజు పర్యవేక్షణలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, రాజకుమారిలు అవార్డు అందజేశారు. లయన్స్ క్లబ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని పలువురు కొనియాడారు.
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. అదివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
11 కాసుల బంగారం చోరీ
ఉండి: గ్రామంలోని శేషాద్రి మధుసూధనరావు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డారు. చోరీలో 11 కాసుల బంగారం, రూ.35 వేల నగదు దోచుకుపోయారు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికకు ఆర్థిక సాయం

బాలికకు ఆర్థిక సాయం