రేపటి నుంచి లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్
ఎంజీఎం: జిల్లాలో లెప్రసీ కేసులు గుర్తించడానికి, ప్రజలకు లెప్రసీపై అవగాహన కల్పించడానికి రేపటి (గురువారం) నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. క్యాంపెయిన్లో భాగంగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉదయం 10 గంటల్లోపు ప్రతీ ఇంటికి తిరిగి వ్యాధిపై అవగాహన కలిగించడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు సర్వేకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. పీహెచ్సీల వారీగా హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టీబీ, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమం కార్యక్రమాలను సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారులు మహేందర్, హిమబిందు, ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి ,హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్, డీపీఎంఓలు సతీశ్రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం గంగేశ్వర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాఘవన్, డీన్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
వరంగల్ అర్బన్: విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో కలిసి 15, 16, 17 డివిజన్న్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఎమ్మెలే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం కావాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు జంక్షన్ల విస్తరణకు చొరవ తీసుకోవాలన్నారు. డివిజన్లలోని రామకృష్ణాపురం, ఏకశిల జంక్షన్లను అభివృద్ధి చేయాలని, గొర్రెకుంటలో అంబేడ్కర్ జంక్షన్కు చెందిన ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంతోష్బాబు, మాధవీలత, డీఈ సతీశ్, టీఎంసీ రమేశ్ పాల్గొన్నారు.
సిబ్బందికి ఆర్టీసీ సేవలు
ములుగు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది సౌకర్యార్థం ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10, 12 గంటలకు, ఒంటి గంటకు సైతం అదనంగా మూడు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు, ఎన్నికల సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు.
రేపటి నుంచి లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్


