
ఆలస్యమే!
ఈసారీ..
గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సకాలంలో ఏఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు టెండర్లకు సంబంధించి ప్రభుత్వం, మత్స్యశాఖ ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిద్ధంకాని మత్స్యశాఖ..
జూన్ నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు చేపపిల్లల పంపిణీ టెండర్లకు మత్స్యశాఖ సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఏడాది ఆలస్యంగా టెండర్లను పిలవడంతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. టెండర్ల విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్ఓ) నాగమణిని శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
సరైన సమయంలో వదిలితేనే ఎదుగుదల..
ఆలస్యంగా ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడంతో తగిన లబ్ధి చేకూరడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. చెరువుల్లో సరైన సమయానికి చేపపిల్లలు వదలకపోవడంతో చేపల్లో ఎదుగుదల లేక ధర రావడం లేదని అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు ఎదగాలంటే చేపపిల్లలను ఆగస్టులోపు చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో పెరిగి చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకే మార్కెట్లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కానీ, గతంలో చాలా ఆలస్యంగా చేపపిల్లను పంపిణీ చేయడంతో సరిగా ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దగా లాభం జరగలేదు.
గత ఏడాది సగం చేపపిల్లలే పంపిణీ
గత వర్షాకాలం జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపప్లిలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, అందులో సగమే ఆలస్యంగా పంపిణీ చేశారని మత్య్ససంఘాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే, చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని మత్స్యసంఘాల వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు.
సొంతంగా కొనుగోలు చేసేందుకు మొగ్గు
చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యం అవుతుండడంతో పలు మత్స్యసంఘాల వారు నీరు చేరిన జలాశయాల్లో సొంత ఖర్చుతో చేపపిల్లలను కొనుగోలు చేసి పోస్తున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పెద్ద సైజు (ఫింగర్ లింగ్స్) చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదలడానికి మత్స్యకారులు సిద్ధం అవుతున్నారు.
నగదు బదిలీ చేయాలి..
టెండర్లు పిలవడం, చేపపిల్లల పంపిణీ ప్రతి ఏడాది ఆలస్యం అవుతోంది. దీనికి బదులు ప్రతీ మత్స్య సంఘాలకు చేపపిల్లలకు బదులుగా నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసుకుంటాం. దీని వల్ల చేపల దిగుబడి కూడా అధికంగా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి.
– కొత్తగట్టు కోటేశ్వర్,
ఊకల్ మత్స్యసంఘం అధ్యక్షుడు
జిల్లాలో మొత్తం చెరువులు: 702
మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం:
12,910 హెక్టార్లు
చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలు :
1.90 కోట్లు
మత్స్య సంఘాలు : 184
మత్స్య సంఘాల్లోని సభ్యులు:
15,741 మంది
జిల్లా సమాచారం..

ఆలస్యమే!