రుణాల కింద భరోసా డబ్బుల జమ | - | Sakshi
Sakshi News home page

రుణాల కింద భరోసా డబ్బుల జమ

Jun 23 2025 5:24 AM | Updated on Jun 23 2025 5:24 AM

రుణాల

రుణాల కింద భరోసా డబ్బుల జమ

నర్సంపేట: రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడిన వెంటనే పలువురు బ్యాంకర్లు పంట రుణం బకాయిలతోపాటు ఇతర బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. దీంతో కొందరు రైతులు చేసేదేమి లేక అప్పుల కింద భరోసా డబ్బులు వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మాత్రం పెట్టుబడికి ఇబ్బందిగా ఉందని, నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు భరోసా నిధులను పంట రుణాలకు జమ చేసుకోవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కొందరు బ్యాంకర్లు రైతులకు డబ్బులు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పెట్టుబడి రెండుసార్లు..

జిల్లాలో వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను విత్తారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పెట్టిన విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలిసిన మొక్కలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ వర్షాకాలంలో పెట్టుబడులు పెరిగిపోనున్నాయి. వీరందరికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఉపయోగంగా మారింది. బ్యాంకర్లు మాత్రం భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవడంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులు ఆదేశించినా..

రైతులకు అందుతున్న రైతు భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవద్దని వ్యవసాయ అధికారులతోపాటు జిల్లా అధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు కూడా నిర్వహించారు. రైతు భరోసా నిధులను పంట రుణ బకాయిల కింద జమ చేసుకుంటే రైతులు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లాలో గ్రామాల వారీగా రైతులు, భరోసా నిధుల వివరాలు..

అధికారుల ఆదేశాలను పట్టించుకోని బ్యాంకర్లు

పంటలకు పెట్టుబడి ఎలా అని

రైతుల ఆందోళన

ఈ పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ రైతు పేరు ధరావత్‌ రమేశ్‌. చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఈయనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున ఐదు ఎకరాలకు రూ.25వేలు రైతుబంధు డబ్బులు పడేవి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.30 వేలు జమయ్యాయి. దివ్యాంగుల సంఘం తరఫున ఎస్‌బీఐలో రూ.లక్ష రుణం తీసుకున్నాడు. దీంతో గతేడాది రూ.30 వేలు, ఈ ఏడాది రూ.30 వేల రైతు భరోసా డబ్బులను రుణం కింద అధికారులు జమ చేసుకున్నారు. దీంతో పంటల పెట్టుబడికి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఆయన ఏర్పడింది. ఈ పరిస్థితి రమేశ్‌ ఒక్కడిదే కాదు.. అనేక మంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

మండలం గ్రామాలు రైతులు నగదు(రూ.కోట్లలో)

నర్సంపేట 16 12,551 10.02

చెన్నారావుపేట 11 11,834 11.20

దుగ్గొండి 18 14,805 13.32

ఖానాపురం 51 8,962 9.09

నల్లబెల్లి 24 14,108 14.71

నెక్కొండ 18 15,377 15.27

గీసుకొండ 16 14,004 12.91

ఖిలా వరంగల్‌ 11 6,058 4.40

పర్వతగిరి 14 14,890 16.69

రాయపర్తి 18 2,00,80 24.58

సంగెం 17 15,519 15.37

వరంగల్‌ 8 2,421 1.50

వర్ధన్నపేట 12 14,575 17.40

మొత్తం 234 1,65,184 166.46

రుణాల కింద భరోసా డబ్బుల జమ1
1/1

రుణాల కింద భరోసా డబ్బుల జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement