
విత్తనాల కోసం పరుగులు.. ‘సబ్సిడీ’ ఊసేలేదు...
గత వానాకాలం సీజన్లో మే మాసం మొదటి వారంలోనే సబ్సిడీపై శనగ, మొక్కజొన్న, వరి విత్తనాలను జాతీయ ఆహార భద్రత పథకం కింద వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అందజేశారు. బీపీటీ5204, 2270, 2782, ఎన్డీఎల్ఆర్8, ఎంటీయూ, ఎంసీయూ తదితర వైరెటీలను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు కాలం నెత్తిమీదికొచ్చినా.. సబ్సిడీ విత్తనాలు అందడం లేదని రైతులు చెబుతున్నారు. అనుకున్నదానికంటే ముందే వర్షాలు పడుతుండడంతో రైతులు కూడా విత్తనాల కోసం తొందరపడి దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ‘కొరత ఏర్పడుతుందని, బ్లాక్ చేస్తారని నేను పత్తి విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నా. సీజన్ మొదలైనప్పటికి మరో వారం రోజుల తర్వాత విత్తనాలు పెడతా. ఎందుకంటే వర్షాలు మధ్యలో ఆగిపోతే విత్తనాలకు పెట్టిన పెట్టుబడి వృదా అవుతుంది’ అని పరకాలలో ఫర్టిలైజర్ దుకాణం వద్ద ఆత్మకూరుకు చెందిన పంతూరి మల్లయ్య చెప్పాడు. పరకాల మండలం చెన్నాపూర్కు చెందిన ఇంగె రాజమల్లు కూడా ‘వర్షాకాలం ముందే వచ్చినట్లు అనిపించి చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ నాకు రెండు.. మూడు వర్షాలు పడితే నమ్మకం కుదురుతుంది. వారం రోజులు ఆగిన తర్వాత విత్తనాలు వేస్తా. పేరున్న బీటీ విత్తనాలు బ్లాక్ చేస్తారనే భయంతో వారం క్రితమే కొనుగోలు చేశా’అని చెప్పుకొచ్చారు.

విత్తనాల కోసం పరుగులు.. ‘సబ్సిడీ’ ఊసేలేదు...