
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా..
ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఆ ఉద్యోగులకు వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది.
కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ
ఔట్సోర్సింగ్
ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం