
అధికారుల ఇష్టారాజ్యం
నర్సంపేట: నిబంధనలకు తూట్లు పొడిచిన అధికారులు.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంగడి ఆదాయానికి గండి కొట్టారు. వేలంలో ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొని వేలం నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్దంగా నర్సంపేట అంగడి వేలం నిర్వహించారు. దీంతో కనీస ఆదాయం కూడా రాలేదని పలువురు వాపోతున్నారు.
నర్సంపేట అంగడి వేలం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతి పెద్ద వారాంతపు సంతల్లో నర్సంపేట అంగడి ఒకటి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి తై బజారు, మేకలు, గొర్రెల సంతకు వేర్వేరుగా ఈనెల 22న వేలం నిర్వహించారు. అయితే అతి తక్కువ మంది హాజరు కావడంతో మున్సిపల్ కమిషనర్ జోనా అంచనా మొత్తం అప్ సెట్ ప్రైస్ రాలేదని వాయిదా వేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. దొడ్డిదారిలో తక్కువ పాడిన వారికి కాంట్రాక్ట్ అప్పగించారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
నర్సంపేట అంగడిని తక్కువకు వేలం పాడారని, మళ్లీ వేలం నిర్వహించాలని పలువురు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేదు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ వేలం నిర్వహించి ఆదాయం వచ్చేలా ఎక్కువ పాడిన వారికి కాంట్రాక్ట్ అప్పగించాలని పలువురు కోరుతున్నారు.
అంగడి వేలంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
నర్సంపేట మున్సిపాలిటీ
ఆదాయానికి గండి
కలెక్టర్కు ఫిర్యాదు చేసినా..
చర్యలు కరువు
నెక్కొండలో ఇలా..
నెక్కొండ అంగడి వేలం నిర్వహించగా.. మూడుసార్లు కనీస ఆదాయం రాలేదు. ఆదాయం సమకూర్చే ఆలోచనతో నాలుగోసారి సైతం వేలంపాట నిర్వహించి అధికంగా పాడిన కాంట్రాక్టర్కు అప్పగించారు. దీనికి విరుద్దంగా నర్సంపేట అంగడి వేలం నిర్వహించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఇష్టారాజ్యం