వనపర్తి: విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్పార్టీ ఎన్ఎస్యూఐ విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హమ్ బదిలేంగే కార్యక్రమానికి ఆయనతో పాటు ఇతర నాయకులు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువత ఉజ్వల భవిష్యత్కు విభాగం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్చార్జ్ రావడం సంతోషంగా ఉందని.. విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఎన్ఎస్యూఐ సభ్యత్వాలు పెద్దఎత్తున చేయించాలని, రాష్ట్రంలోనే వనపర్తిని అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, నాయకులు కోట్ల రవి, ఆదిత్య, ఎత్తం చరణ్రాజ్, మన్యంకొండ, కృష్ణబాబు, చంద్రమౌళి, వెంకటేష్, రఘుయాదవ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
ఆత్మకూర్: పుర కేంద్రంలో ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళలు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుర కమిషనర్ శశిధర్ హాజరై మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తమ వంటల నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, ఆహార ఉత్పత్తులను విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు గొప్ప అవకాశమన్నారు. సాంప్రదాయ వంటకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. ఉత్సవాలతో క్యాటరింగ్ ఆర్డర్లు వస్తాయని, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా వంటకాలను ప్రదర్శించిన మహిళలను కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, వార్డు అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
పెంపకందారుల సమస్యల సాధనకు పోరాటం
పాన్గల్: గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల సాధనకు పోరాటాలు కొనసాగించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అన్నారు. ఆదివారం మండలంలోని రేమద్దులలో జిల్లా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీవాల మేత కోసం ప్రభుత్వం కొండలు, బంజారు భూములు కేటాయించాలన్నారు. నేటి పాలకుల విధానాలతో సహజ వనరులన్నీ పెట్టుబడిదారులు, ధనిక వర్గాలకు కేటాయిస్తుండటంతో కాపారులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.
వాతావరణ మార్పులతో జీవాలకు రోగాలు పెరుగుతున్నా.. ఏ రకమైన మందులు పంపిణీ చేయడం లేదన్నారు. రెండో విడత రాయితీ గొర్రెల లబ్ధిదారులకు రూ.2 లక్షలు జమ చేస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదని వివరించారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న జిల్లాకేంద్రంలోని యాదవ సంఘం భవనంలో నిర్వహించే జిల్లా సదస్సుకు కాపా రులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వేణుగోపాల్, బాలస్వామి, వెంకటయ్య, నిరంజన్ పాల్గొన్నారు.
టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అమరచింత వాసి
అమరచింత: టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అమరచింతకు చెందిన కె.సూర్యం ఎన్నికయ్యా రు. ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ తెలిపారు. రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ప్రసాద్, హన్మంతు, రాజుకు చోటు లభించినట్లు తెలిపారు.

విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం