
యోగాతో ఆరోగ్యం పదిలం
వనపర్తి: మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడితో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని.. వాటిని దూరం చేయడానికి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక మర్రికుంట గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగా ప్రధాన కార్యదర్శి సుగుణ కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు యోగా సాధన చేసే వారని, 2014లో ప్రధాని మోదీ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా అమలయ్యేటట్లు చేశారన్నారు. నిత్యం యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, ఆయుష్ విభాగం వైద్యురాలు డా. మంజుశ్రీ, డా. ఒమర్ అలీ, డా. జ్యోతి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.