మేడ్చల్ జిల్లా: నన్ను శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా అని లేఖరాసి ఓ యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. పర్వతాపూర్ సాయిఐశ్వర్య కాలనీలో నివాసముంటున్న శైలజ(39) కుమార్తె మధుహసిత(19) ఇంటివద్దే ఉంటోంది. గతంలో లాలాపేటలో నివాసమున్నపుడు యువతికి ఓయువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో అతనితో మాట్లాడడం మానేసింది. ఈ నెల 27న సాయంత్రం తల్లి శైలజ ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. ఇంట్లో తల్లికి ఓలేఖ లభించింది. ఆ లేఖలో ‘‘నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను.. లార్డ్ శివయ్య పిలుస్తున్నాడు’’ అని లేఖలో పేర్కోంది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువకుడితో వెళ్లిపోయిన బాలిక..
బంజారాహిల్స్: ఓ బాలిక యువకుడితో వెళ్లిపోయిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోరబండలో నివసించే బాలిక (14) జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఓ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తోంది. కొంతకాలంగా అంజు (25) అనే యువకుడితో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున యజమానురాలి కళ్లు గప్పి అంజుతో వెళ్లిపోయింది. దీంతో యజమానురాలు బాలిక తల్లికి సమాచారం అందించింది. కొంతకాలంగా అతనితో ఫోన్లో మాట్లాడుతోందని, చాటింగ్ కూడా చేస్తున్నదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. తన కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


