సరికొత్తగా తిరుపతి లడ్డూ ప్యాకింగ్‌: టీటీడీ కీలక నిర్ణయం | TTD: Tirupati Laddu Packing In Ecolostic Bag | Sakshi
Sakshi News home page

సరికొత్తగా తిరుపతి లడ్డూ ప్యాకింగ్‌: టీటీడీ కీలక నిర్ణయం

Jul 17 2021 4:45 AM | Updated on Jul 17 2021 2:12 PM

TTD: Tirupati Laddu Packing In Ecolostic Bag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ / కుషాయిగూడ: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచీల్లో లభించనుంది. నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్‌ స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్‌)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ రామ్‌మనోహర్‌బాబు వెల్లడించారు. ప్రమాదకర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్‌డీవోతో కలసి హైదరాబాద్‌ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎకొలాస్టిక్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్‌)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవితో కలసి శుక్రవారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌మనోహర్‌బాబు మాట్లాడుతూ దైనందిన జీవితంలో విడదీయరాని భాగం గా మారిన ప్లాస్టిక్‌... భూమి, నేల, నీరు, జలచరా లకు ప్రమాదంగా పరిణమించిందన్నారు. ప్లాస్టిక్‌ బదులుగా వాడి పడేసిన కొన్ని నెలలకే సురక్షితం గా, సంపూర్ణంగా నాశనమయ్యే ఎకొలాస్టిక్‌ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్త కె. వీరబ్రహ్మం, నాగార్జున వర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల ఫలితంగా ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ ఆవిష్కరణ జరిగినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోగా దేశవ్యాప్తంగా వాడిపారేసే ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలన్న నిర్ణయం నేపథ్యంలో ఇలాంటి ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement