హైదరాబాద్: ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ జట్ల బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ స్టేడియం వైపు వచ్చే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి హెచ్ఎండీఏ లేఅవుట్ ద్వారా నాగోల్ వైపు నుంచి వెళ్లాలి.
ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి యూ టర్న్ తీసుకుని భగాయత్ లే అవుట్ ద్వారా వరంగల్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చెంగిచర్ల ఐఓసీ నుంచి వరంగల్ వైపు పోవాలి. వరంగల్ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎక్కి ఎల్బీనగర్ నుంచి నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది.


