SCR General Manager reacts on Godavari Express derails - Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ‘ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు’

Feb 15 2023 10:36 AM | Updated on Feb 16 2023 8:28 AM

SCR general Manager Reaction On Godavari Express derailed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అంకుషాపూర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.  అనంతరం  రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

అంకుషాపూర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 16 పైగా బోగిలతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరిందని, అందులోని ఆరో బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు.

ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు. రైలులోని వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ (040 27786666) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.  దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.

‘గోదావరి ఎక్స్‌ప్రెస్‌ భోగిలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్‌మన్-బుష్) బోగిలే. ఒక ఎల్‌ఎహెచ్‌బీ కోచ్ కాలపరిమితి 35 ఏళ్లు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అ‍ల్యూమినియం స్టీల్‌తో కోచ్‌ల తయారీ అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్‌లను తయారు చేయిస్తున్నాం.

ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో, మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్‌లో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఆధునాతనంగా ఉంటుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగలుగుతుంది.’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement