వారాంతపు లాక్‌డౌన్‌పై పరిశీలించి నిర్ణయం: సీఎస్‌

CS Somesh Kumar Press Meet About COVID Situation In Telangana - Sakshi

కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అమలు చేసినా పెద్దగా తేడా రాలేదు: సీఎస్‌

వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు సూచనలు పరిశీలించి నిర్ణయం

ప్రజల జీవనోపాధి గురించి కూడా ఆలోచించాలి

రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి

కేంద్ర పరిధిలోని వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ వంటి వాటికే ఇబ్బందులు

కేంద్రం నుంచి తగిన సంఖ్యలో వస్తేనే 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌

10 రోజులుగా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతోంది

ఓపీ సేవలు, మందుల కిట్ల పంపిణీతో మంచి ఫలితాలు

జీహెచ్‌ఎంసీలో మాదిరిగానే అన్ని జిల్లాల్లో కాల్‌సెంటర్లు

600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటే 430 ఎంటీలే ఇచ్చారు

రాష్ట్రానికి మే నెలకు 3.90 లక్షల వ్యాక్సిన్లే ఇచ్చారు

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా పెద్దగా తేడా రాలేదు. ప్రజల జీవనోపాధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారాంతంలో లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

పతన దిశలో కోవిడ్‌ సరళి.. 
‘రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి సరళి దిగువకు (ట్రెండ్‌ డౌన్‌వర్డ్‌) పోతోంది. ఇది ఇంకా తగ్గుతుందని ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి. కొంత కాలం తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంటుంది. చివరి 10 రోజుల పాజిటివిటీ రేటు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. వ్యూహాత్మకంగా కరోనా రోగులకు ఓపీ సేవలు ప్రారంభించడం, లక్షణాలు కలిగిన వారికి మందుల కిట్ల పంపిణీకి తీసుకుంటున్న చర్యలతో మరో వారంలో ఫలితం కనిపిస్తుంది. రోజులో ఎంతమంది పాజిటివ్‌ అవుతున్నారు, పాజిటివిటీ రేటు ఎంత, ఆస్పత్రి బెడ్ల వినియోగం ఏమేరకు ఉంది? వంటి సూచికల ద్వారా ట్రెండ్‌ దిగువకు పోతోందని అంచనా వేశాం. కరోనా తొలి వేవ్‌ తర్వాత చాలావరకు ఇతర రాష్ట్రాలు పని ఆపేస్తే, మేము ఆక్సిజన్‌ బెడ్లు, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరిగినా ఇబ్బంది రాలేదు. మొదటి దశలో 18 వేల కోవిడ్‌ బెడ్స్‌ ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 52 వేలకు పెంచాం. ఈరోజు దేశానికి వైద్య రాజధాని హైదరాబాద్‌. ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి 33 ఎయిర్‌ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వచ్చాయి..’అని సీఎస్‌ తెలిపారు. 

కేంద్రం సంబంధిత అంశాల్లోనే సమస్యలు
‘రాష్ట్ర పరిధిలోని అంశాల్లో సమస్యల్లేవు. మా దగ్గర 25 లక్షలకు పైగా ఎన్‌–95 మాస్కులు, 6 లక్షలకు పైగా పీపీఈ కిట్లు, 86 లక్షల త్రీ ప్‌లై మాస్కులు, 3 లక్షల ఆర్టీపీసీఆర్, 11 లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్, 6.38 లక్షల హోం ట్రీట్‌మెంట్‌ కిట్లు, రెమ్‌డెసివిర్‌ 90 వేలు. టోసిలిజుమాబ్‌ 63 వాయిల్స్‌ ఉన్నాయి. మరో 5 లక్షల డోసుల రెమ్‌డెసివిర్‌ ఆర్డర్‌ చేశాం. ఏప్రిల్‌లో 4 లక్షల డోసులు వాడడం జరిగింది. రాష్ట్రానికి రోజూ 25 వేల రెమ్‌డెసివిర్‌ డోసులు అవసరమని హైకోర్టుకు తెలిపాం. కానీ కేంద్రం నుంచి రోజుకు 5 వేలు మాత్రమే వస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన వాటి నుంచే సమస్య వస్తోంది. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులకు రోజుకు 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటే కేంద్రం 430 మెట్రిక్‌ టన్నులు కేటాయించింది. తమిళనాడు, కర్ణాటక నుంచి రావాల్సిన 45 టన్నుల ఆక్సిజన్‌ రావడం లేదు. రాష్ట్రానికి 125 ఎంటీల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దేశంలో మొదటిసారిగా వాయుసేన విమానాలతో ఆక్సిజన్‌ ట్యాంకర్లను రాష్ట్రం తెప్పించుకుంది. 14 ట్రిప్పుల్లో 48 ట్యాంకర్లు వచ్చాయి. రాష్ట్రంలో 17 ఆర్టీపీసీఆర్‌ ల్యాబులుండగా, ప్రతిజిల్లాలో ఈ సదుపాయం కల్పించే దిశగా మరో 14 ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్లు ముగిశాయి..’అని వివరించారు.

వ్యాక్సిన్ల సరఫరా తగ్గింది
‘రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరాను కూడా కేంద్రం తగ్గించింది. మన రాష్ట్రంలోనే వ్యాక్సిన్‌ కంపెనీ ఉన్నా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో కేంద్రం నియంత్రిస్తోంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల జనాభా 1.70 కోట్లు ఉండగా, 3.40 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. మే నెల కోసం కేంద్రం రాష్ట్రానికి 3.90 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఇచ్చింది. అయితే 30 నుంచి 40 లక్షల వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని కోరాం. ఆ మేరకు వస్తేనే 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ప్రారంభిస్తాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా ప్రధానితో మాట్లాడతారు. జూన్, జూలై తర్వాత వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆలోగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బయలాజికల్‌–ఇ వ్యాక్సిన్‌ కూడా వస్తుంది..’అని సీఎస్‌ తెలిపారు.

సకాలంలో చికిత్సే రక్ష
‘చికిత్సలో జాప్యం, నిర్లక్ష్యం వల్లే కరోనా రోగుల పరిస్థితి విషమిస్తోంది. లక్షణాలు కనిపించిన వెంటనే మందులు మొదలు పెడితే సమస్యలు రావు. అందుకే ప్యూహాత్మకంగా లక్షణాలున్న వారందరికీ మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలో సీరియస్‌ కేసులు ఉండవు. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు. జీహెచ్‌ఎంసీలో దీనిని ప్రారంభిస్తే 2 రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు జిల్లాల్లో ప్రారంభిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి, సబ్‌ సెంటర్, పీహెచ్‌సీలో కోవిడ్‌ ఔట్‌ పేషంట్‌ సేవలు ప్రారంభించాం. లక్షణాలున్న వారికి మందుల కిట్లు ఇస్తారు. మందులు ఎలా వాడాలో తెలిపే కరపత్రం కూడా ఉంటుంది. మరోవైపు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ/మున్సిపల్‌ సిబ్బందితో ప్రతి 1,000 గృహాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. వారు లక్షణాలున్న వారిని గుర్తించి మందుల కిట్లు ఇస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 040–21111111 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లే.. అన్ని జిల్లాల్లోనూ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి కోవిడ్‌ బాధితులకు సేవలందిస్తాం. ఇప్పటికే ఉన్న 104 సేవలకు ఇవి అదనం..’అని చెప్పారు.

మరణాలపై మా లెక్కలే కరెక్ట్‌
‘కోవిడ్‌–19 మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నవే అసలైన అంకెలు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే కోవిడ్‌–19 మరణాలను ధ్రువీకరిస్తున్నాం. కోర్టు కేసుల చిక్కుల వల్లే కాంట్రాక్టు విధానంలో వైద్య సిబ్బంది నియామకాలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యతను ప్రభుత్వ వైబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కొరత లేదు. పలుకుబడి కలిగిన వారికి మాత్రమే బెడ్లు లభిస్తున్నాయనే ఆరోపణలు వస్తుండడంతో మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించాం..’అని సీఎస్‌ వివరించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top