
కందకోట్టం మురుగన్ ఆలయంలో మహాకుంభాభిషేకం
– వేడుకల్లో మంత్రి శేఖర్బాబు
కొరుక్కుపేట: చైన్నెలోని పార్కుటౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ కందకోట్టం శ్రీ కందస్వామి ఆలయం అని పిలవబడే శ్రీముత్తుకుమార స్వామి ఆలయం మహాకుంభాభిషేకం బుధవారం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో హిందూధర్మాదాయ శాఖమంత్రి పీకే శేఖర్ బాబు పాల్గొని జెండా ఊపి కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. ఈనెల 10వతేదిన విఘ్నేశ్వర పూజ, గణపతి హోమంతో అంగరంగ వైభవంగా కుంభాభిషేక పూజలు ఆరంభమయ్యాయి. ఈనేపథ్యంలో బుధవారం యాగపూజ , ప్రత్యేకధీరవ్య హోమం, మహాపూర్ణాహుతి, దీపరాధన చేపట్టారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పైగా శివాచార్యులు రాజగోపురం, అన్ని గోపుర కలశాలలను అందంగా అలంకరించి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని మంత్రి శేఖర్ బాబు ప్రారంభించారు. ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి కుంభాభిషేకాన్ని తిలకించారు. పవిత్ర జలాలను భక్తులపై చల్లటంతో పరవశించి పోయారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించారు. ఇందులో మేయర్ ప్రియ, ఆలయ ధర్మకర్త , విద్యాశాఖ అధిపతి ఏపీ అశోక్కుమార్, విద్యాశాఖ కమిటీ ధర్మకర్తలు కె నందకుమార్ , ఏఎన్ సురేష్ కుమార్ , కార్యదర్శి లక్ష్మణ స్వామి ఉన్నారు.