
ఈసీ గుర్తించాలంటే అధిక సీట్లు
● ఎండీఎంకే భేటీలో తీర్మానం
సేలం: ఎన్నికల కమిషన్ (ఈసీ) గుర్తింపు పొందాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లలో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈరోడ్లోని పెరుందురై పరిమళం మహల్లో ఆదివారం ఎండీఎంకే రాష్ట్ర జనరల్ కమిటీ సమావేశం జరిగింది. జనరల్ కమిటీ సమావేశానికి చైర్మన్, ఆడిటర్ అర్జున్ అధ్యక్షత వహించారు. పార్టీ ప్రధానకార్యదర్శి వైగో, ప్రిన్సిపల్ సెక్రటరీ దురై వైగో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లై సత్య, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర జనరల్ కమిటీ సభ్యులు సహా 1,700 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే, కశ్మీర్ పహల్గామ్ మృతులకు, అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించారు.
అధిక సీట్లలో పోటీ అవసరం
2017లో ఎన్నికల పొత్తుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే విధంగా నిర్ణయించారు. 1997 నుంచి 2010 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును పార్టీ కలిగి ఉన్నట్టు, ఈ గుర్తింపు మళ్లీ దక్కాలంటే, 2026 ఎన్నికల్లో కూటమిలో అధిక సీట్లను రాబట్టే ప్రయత్నం చేసి, పోటీచేయాలన్న నిర్ణయానికి వస్తూ తీర్మానం చేశారు. అనంతరం నిర్బంధ విద్యా హక్కు చట్టం, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ వ్యవహరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం 2026 అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. వైగో మాట్లాడుతూ సమావేశానికి 1,504 మంది హాజరయ్యారని వివరించారు. 28 తీర్మానాలు ఆమోదించామన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు పతనం తప్పదని, దేవుడి రాజకీయాల కోసం వాడుకోవడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. డీఎంకే కూటమి బలంగా ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఈసీ గుర్తించాలంటే అధిక సీట్లు