
ప్రతిపక్ష నేతకు డీఎంకే కౌన్సిలర్ చెంపదెబ్బ
అన్నానగర్: అన్నాడీఎంకే, ప్రతిపక్ష నేతను డీఎంకే మహిళా కౌన్సిలర్ చెంపదెబ్బ కొట్టింది. వివరాల్లోకి వెళితే.. సేలం కార్పొరేషన్ మేయర్ రామచంద్రన్ అధ్యక్షతన గురువారం ఉదయం అత్యవసర, సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిషనర్ డాక్టర్ ఇళంగోవన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శారతాదేవి, మండల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిలర్లు నీటిని క్రమం తప్పకుండా అందించాలని, ప్రతి 12 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. పన్నులు తగ్గించాల్సిన అవసరం సహా వివిధ డిమాండ్లను నొక్కి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు యాదవమూర్తి మాట్లాడుతూ వార్డు కౌన్సిలర్లకు కూడా సమాచారం ఇవ్వకుండానే పనులు ప్రారంభిస్తున్నారన్నారు. అలాగే తన వార్డులో వివిధ ఫిర్యాదులు ఉన్నాయని, కానీ ఏ ఫిర్యాదునూ పరిష్కరించలేదన్నారు. తక్కువ మొత్తం అడిగిన వారికి టెండర్ ఇవ్వడానికి బదులుగా, అత్యధిక మొత్తం అడిగిన మంత్రి మద్దతుదారునికి కాంట్రాక్టు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని డీఎంకే వ్యతిరేకించింది. దీంతో డీఎంకే–ఏడీఎంకే కౌన్సిలర్ల మధ్య వాదన జరిగింది. ఇదిలా ఉండగా, 45వ వార్డు కౌన్సిలర్, ప్రతిపక్ష నేత యాదవ్ మూర్తి చెంపపై కౌన్సిలర్ సుహాసిని కొట్టింది. దీంతో సమావేశంలో కలకలం నెలకొంది. ఏడీఎంకే, డీఎంకె. కౌన్సిలర్లు వంతుల వారీగా వాదించుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. ఇంతలో మేయర్ సమావేశం ముగిసినట్లు ప్రకటించి, జాతీయ గీతం ఆలపించి వెళ్లిపోయారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు యాదవమూర్తి నేతృత్వంలో ఏడీఎంకే కౌన్సిలర్లు కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ కుర్చీ ముందు కూర్చుని ధర్నా చేశారు.

ప్రతిపక్ష నేతకు డీఎంకే కౌన్సిలర్ చెంపదెబ్బ