
వైశ్యులకు ప్రభుత్వ సహకారం అంతంతే
● ఏపీ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ వ్యాఖ్య ● చైన్నెలోని వామ్ సభ్యులతో సమావేశం
కొరుక్కుపేట: వైశ్యసామాజిక వర్గానికి ప్రభుత్వాల సహకారం అంతంత మాత్రంగానే ఉందని ఏపీ మాజీ మంత్రి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) గౌరవ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేశ్ అన్నారు. ఇలాంటి సందర్భంలో వామ్ సంస్థ వెనుకబడిన అర్యవైశ్యులకు సహయసహకారాలు అందించడం హర్షణీయమని ఆయన కొనియడారు. బుధవారం రాత్రి చైన్నె వచ్చిన సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో వామ్ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులతో ఆయన మాట్లాడారు. వైశ్యులు అన్ని కులాలా వారిని ఆదరిస్తూ సమాజానికి హితోధికమైన సేవ చేస్తారని, ధర్మసత్రాలు, పుణ్యక్షేత్రాలు కానీ ఏవి చూసినా వైశ్యుల ఉనికి కనిపిస్తుందన్నారు. రాజ్యాంగ పరంగా ఓసీ కావడంతో సరైన ప్రభుత్వ సహకారం లభించడం లేదన్నారు. ఈ క్రమంలో వామ్ వంటి సంస్థ నెలకొల్పడం ప్రపంచంలో సుమారు 40 దేశాల్లో విభాగాలు ఏర్పాటు చేసి, తంగుటూరి రామకృష్ణ ముందుకు తీసుకుని పోతున్నారని కొనియాడారు. ఇలాంటి సంస్థ వెనుకబడిన వైశ్యులకు సహాయం చేయడమే కాకుండా పలు న్యాయపోరాటాలు చేస్తుండడం, ప్రత్యేకించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ సంస్థను మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని తంగుటూరి రామకృష్ణను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వామ్ తరఫున కొత్తగా వామ్ ఎలైట్ విభాగ్స్ను లాంఛనంగా టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. ముందుగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ వామ్ చేస్తున్న సేవలను వివరించారు. మాజీ గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ప్రారంభమైన వామ్ అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తోందన్నారు. వైశ్యుల తరఫున అనేక సంస్థలు పని చేస్తున్నప్పటికీ వాటన్నిటికీ విభిన్నంగా వామ్ సంస్థ వైశ్యుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు. సీతమ్మ ట్రస్టు తరఫున రూ.కోట్ల విలువ చేసే భూమిని అందించడం చాలా సంతోషంగా ఉందని టీజీ వెంకటేశ్కు అవోపా అధ్యక్షులు తాడేపల్లి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. వామ్ మహిళా విభాగం చైన్నె అధ్యక్షురాలు శ్రీలత, సభ్యులు త్రినాథ్, ఆర్యవైశ్య ప్రముఖులు రవి కుమార్, కుమరవేల్, సూరిశెట్టి బాలాజీ, వీఎన్ హరినాథ్, జగదీష్శర్మ తదితరులను టీజీ వెంకటేశ్ చేతుల మీదుగా సత్కారించారు.