
తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పరిహారం ఇవ్వడంలో 13 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం పెద్దకుప్పంలో రైతులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తులసీనారాయణన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా స్వామినటరాజన్ హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వామి నటరాజన్ మాట్లాడుతూ తిరుపతి–చైన్నె జాతీయ రహదారి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో తరచూ జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తున్నామని చెప్పారు. ఇటీవల రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే ఢిల్లీబాబును అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు ఆయనపై దాడికి దిగిన టౌన్ ఇన్స్పెక్టర్ అంథోనీస్టాలిన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెయ్యూరు గ్రామంలో రైతు సంఘం నేతకు చెందిన స్థలంలో తమ సంఘం జెండాను ఏర్పాటు చేస్తే పోలీసులు అనుమతి లేదని తొలగించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం నేతలు సంపత్, పెరుమాల్, తమిళరసు ిసీపీఎం జిల్లా కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.