
రథోత్సవంలో అన్నాడీఎంకే రగడ
తిరుత్తణి: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రథోత్సవం సందర్భంగా మాజీ సీఎం చిత్రపటంతో రథం లాగడం వివాదానికి దారి తీసింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బుధవారం రాత్రి సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథోత్సవంలో రథం లాగేందుకు అన్నాడీఎంకేకు చెందిన నటి రఘురామన్, తిరువళ్లూరు పట్టణ డీఎంకే కన్వీనర్ రచిచంద్రన్ సహా ఆరుగురు భక్తులు సేవా రుసము రూ.3500 చొప్పున చెల్లించారు. రథోత్సవంలో పాల్గొన్న ఉభయకర్తలను ఏమాత్రం పట్టించుకోని నటి గాయత్రీ రఘురామన్తోపాటు అన్నాడీఎంకే శ్రేణులు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చిత్రపటం చేతిలో ఉంచుకుని కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఉభయకర్తలు, భక్తులు ఆలయంలో రాజీకం ఏమిటని అన్నాడీఎంకే శ్రేణులను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో కాసేపు రథోత్సవం ఆగింది. భక్తుల వ్యతిరేకతతో నటి గాయత్రీరఘురామ్తో పాటు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే శరవణన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. రథోత్సంలో రాజకీయ నినాదాలు చేసినట్లు ఆలయాధికారి ఫిర్యాదు మేరకు తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.