
బస్షెల్టర్ నిర్మాణానికి వ్యాపారుల వ్యతిరేకత
తిరుత్తణి: బస్షెల్టర్ నిర్మాణ పనులను వ్యాపారులు అడ్డుకోవడంతో తిరుత్తణిలో గురువారం హడావుడి చోటుచేసుకుంది. తిరుత్తణి రైల్వేస్టేషన్ సమీపంలోని అక్కయ్య రోడ్డులో బస్స్టాపింగ్ వద్ద బస్ షెల్టర్ లేక పోవడంతో ప్రయాణికులు రోడ్డుపై ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.23 లక్షలు కేటాయించి, అక్కయ్య రోడ్డులో అత్యాధునిక సదుపాయాలతో బస్షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే చంద్రన్ నాలుగు రోజుల కిందట భూమిపూజ చేశారు. ఈ క్రమంలో గురువారం బస్షెల్టర్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే దుకాణాలకు ముందు బస్షెల్టర్ ఏర్పాటు చేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని ఆరోపిస్తూ బస్షెల్టర్ నిర్మాణ పనులను కొంతమంది వ్యాపారులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, సమస్య పరిష్కారానికి హైవే శాఖ అధికారులను పిలిపించి, రోడ్డు సర్వే చేయించారు. హైవే రోడ్డుకు పక్కగా బస్షెల్టర్ నిర్మాణ పనులు చేపట్టినట్లు నిర్ధారణ కావడంతో వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న బస్షెల్టర్ నిర్మాణ పనులు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కందన్ వ్యాపారులను హెచ్చరించారు. దీంతో వారందరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో బస్షెల్టర్ పనులు చేపట్టారు.