
ఘనంగా కాంచీపురం సహకార బ్యాంకు వార్షికోత్సవం
తిరువళ్లూరు: కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు 111వ వార్షికోత్సవ వేడుకలను సెంగుడ్రం బ్రాంచీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంచీపురం కేంద్ర సహాకార బ్యాంకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు తదితర మూడు జిల్లాలో ఐదు లక్షల మంది ఖాతాదారులతో లావాదేవీలను నిర్వహిస్తూవుంది. గత 110 సంవత్సరాలుగా కాంచీపురం సహకర బ్యాంకు ద్వారా రుణాలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులకు రుణాల, హౌసింగ్, గోల్డ్ రుణాలను అందజేస్తున్న విష యం తెలిసిందే. ప్రతి సంవత్సరం బ్యాంకు వార్షిక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న క్రమంలో 111వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు రిజిస్ట్రార్ మేనేజింగ్ డైరెక్టర్ శివమలర్ హాజరై 122 మంది లబ్ధిదారులకు 74.70 లక్షల రూపాయల రుణాలను అందజేశారు. స్వయం ఉపాధి సంఘాలు తమ పొదుపు స్థాయిని పెంచుకోవడంతో పాటూ రుణాలను సక్రమంగా చెల్లించాలని సూచించారు. రుణాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంఘాలు తమ ఆర్థిక పురోగతిని సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.