
ఆర్ట్స్ అండ్ సైన్స్కు డిమాండ్
● కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి శ్రీకారం ● ఐదు కళాశాలలకు లక్షన్నర దరఖాస్తులు ● సీట్ల పెంపునకు విజ్ఞప్తి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ప్రత్యక్ష కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి ఆయా కళాశాలలో బుధవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ఐదు కళాశాలలకు ఏకంగా లక్షన్నర దరఖాస్తులు రావడంతో సీట్లకు పోటీ పెరిగినట్లైంది.
గత నెల ప్లస్టూ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్లోని కీలకం మినహా తక్కిన కోర్సులపైన మక్కువ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరిగినట్లైంది. రాష్ట్రంలో కొత్తగా గత నెల ఏర్పాటు చేసిన 11 కళాశాలతో పాటు మొత్తం 180 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి లక్షా 25 వేల సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా 2.25 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో లక్షా 84 వేల 762 మంది దరఖాస్తు రుసుం సైతం చెల్లించారు. వీటిలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఏ తమిళ్, బీకాం, బీఏ ఇంగ్లిషు, బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సులకు డిమాండ్ మరింత పెరిగింది. బుధవారం ఉదయం నుంచి ఆయా కళాశాలలో విద్యార్థుల మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
ఐదు కళాశాలలకు 60 శాతం దరఖాస్తులు
రాష్ట్రంలో 180 కళాశాలలు ఉండగా, ఐదు కళాశాలల ఖాతాలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం దరఖాస్తుల సంఖ్యలో 60 శాతం పడింది. చైన్నెలో రాజధాని కళాశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ కళాశాలలో 2,380 సీట్లు ఉన్నాయి. వీటి కోసం 40,167 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఆ తర్వాత కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. ఇక్కడ 1,727 సీట్లు ఉండగా 33,705 మంది దరఖాస్తు చేసుకున్నారు. చైన్నె నందనం కళాశాలలో 1,430 సీట్లు ఉండగా 29, 376, వ్యాసార్పాడి అంబేడ్కర్ కళాశాలలో 1,086 సీట్లు ఉండగా 29, 275, తిరుచ్చి తందైపెరియార్ ఆర్ట్స్ కళాశాలలో 1,600 సీట్లు ఉండగా 24, 396 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐదు కళాశాల్లో చేరడానికి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఈ ఐదు కళాశాల్లో సీట్లకు డిమాండ్ రెట్టింపుగా మారింది. ఇక, ఇతర కళాశాలలోనూ సీట్ల కన్నా ఎక్కువగానే దరఖాస్తులు వచ్చిన దష్ట్యా, సీట్లను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యాశాఖకు వినతులు చేరుతున్నాయి.