
ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్
సాక్షి, చైన్నె: కాంచీపురం జిల్లా ఇరుంగాట్టు కోట్టైలో అజైల్ రోబోట్స్ పరిశ్రమ రూ. 300 కోట్లతో ఏర్పాటైంది. 300 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటైన ఈ పరిశ్రమంలో కృత్రిమ మేధస్సు ఆధారంగా రోబోట్స్ తయారీకి సంబంధించిన విడి భాగాలను ఉత్పత్తి చేయనున్నారు. అలాగే రాణిపేటలో రూ.175 కోట్ల పెట్టుబడితో ఎస్ఓఎల్ ఇండియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ఏర్పాటైంది. వీటిని సీఎం స్టాలిన్ బుధవారం ప్రారంభించారు.
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా తమిళనాడు, వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించడంలో, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దూసుకెళుతోంది. 2024–25 ఆర్థిక సర్వే మేరకు తమిళనాడు 9.69 శాతం వృద్ధిని సాధించింది. గత పదేళ్లలో అత్యధిక వృద్ధి రేటుతో భారతదేశంలో మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది. 2030 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వృద్ధిని సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమిళనాడు ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చే విధంగా అనేక విదేశీ సంస్థలు పెట్టుబడులను విస్తృతంగా పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులోభాగంగా కాంచీపురం జిల్లా ఇరుంగాట్టు కోట్టైలో అజైల్ రోబెట్స్ కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తూ, దాని ఆధారంగా రోబోటిక్స్కు అవసరమయ్యే అన్ని రకాల విడి భాగాల తయారీ, ఆటోమేషన్ పరిష్కారాలను అందించే దిశగా పరిశ్రమను ఏర్పాటైంది. ఇక్కడి అన్ని రకాల నిర్మాణాలు పూర్తి చేసిన ఉత్పత్తి ప్రక్రియ మీద దృష్టి పెట్టారు. 300 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించారు. 2019 ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎస్ఓఎల్ ఇండియా ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఏడాదిన్నర క్రితం ఈ పనులకు శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం నిర్మాణాలు పూర్తిచేసుకుంది. రూ.175 కోట్లతో ఏర్పాటైన ప్లాంట్లను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి ఉదయం ప్రారంభించారు. అజైల్లో ఇంటర్న్షిప్ చేయడానికి వివిధ కళాశాలల నుంచి ఎంపికై న ఆరుగురు అభ్యర్థులకు సీఎం స్టాలిన్ సర్టిఫికెట్లను అందజేశారు. పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా, ప్రధాన కార్యదర్శి మురుగానందం, పరిశ్రమల శాఖ కార్యదర్శి వి.అరుణ్రాయ్, తమిళనాడు కెరీర్ గైడెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలర్మేల్ మంగై పాల్గొన్నారు. కాగా, నాగపట్నంలో మినీ టైడల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర పరిశీలన నివేదిక సమర్పణకు కమిటీని నియమిస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారు.
పరందూరు పనులపై సమీక్ష...
అనంతరం సచివాలయంలో చైన్నెలో రెండవ విమానాశ్రయం కోసం ఎంపిక చేసిన పరందూరు పరిసరాల్లో సాగుతున్న స్థల సేకరణపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్షించారు. కాంచీపురం జిల్లా పరందూరులో ఈ విమానాశ్రయం 20 గ్రామాలను కలుపుతూ నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఏకనాపురం వేదికగా నిరసన ఉద్యమం సాగుతోంది. పదికి పైగా గ్రామాల ప్రజలు విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో స్థలసేకరణ వేగవంతంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న స్థల సేకరణ పనులు, ఆతర్వాత చేపట్టాల్సిన ఇతర పనులు, అనుమతులకు సంబంధించి అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షించారు. సీఎంకు అధికారులు సమగ్ర వివరాలను తెలియజేశారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం, ఆ గ్రామాల్లో చేపట్టాల్సిన స్థల సేకరణ అంశాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. అలాగే, చెంగల్పట్టు జిల్లా కదంబూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి జీవవైవిధ్య పరిరక్షణ ఉద్యానవనం గురించి సీఎం ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో సమీక్షించి, పలు సూచనలు ఇచ్చారు. మంత్రులు తంగం తెన్నరసు ,రాజకన్నప్పన్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను విచారించే లోకాయుక్త న్యాయరంగానికి సంబంధించి సభ్యుడి నియామకం నిమిత్తం కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్, స్పీకర్ అప్పావు పాల్గొనగా, ప్రధాన ప్రతి పక్షనేత పళనిస్వామి గైర్హాజరయ్యారు. కాగా, రష్యా పర్యటన ముగించుకుని చైన్నెకు డీఎంకే ఎంపి కనిమొళి చేరుకున్నారు. ముందుగా ఆమె సీఎం స్టాలిన్ను కలిసి తన పర్యటన గురించి వివరించారు. ఈనెల 11,12 తేదీల్లో సేలం, ఈరోడ్ జిల్లాలో పర్యటనకు సీఎం స్టాలిన్ సిద్ధమవుతున్నారు.
న్యూస్రీల్
ఏఐతో విడిభాగాల తయారీ పరిశ్రమ
రూ.300 కోట్లతో ఏర్పాటు
రాణిపేటలో రూ.175 కోట్లతో ఎయిర్ సెపరేషన్ ప్లాంట్
ప్రారంభించిన సీఎం స్టాలిన్
లోకాయుక్త కమిటీతో సమావేశం

ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్

ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్

ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్