
తమిళ నటుడికి మలయాళ పురస్కారం
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే నటుడు సంపత్ రామ్ రచ్చ గెలుస్తూ ఇంట గెలవాలని ఆశ పడుతున్నారు. చిన్న చిన్న పాత్రలతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రముఖ ప్రతినాయకుడిగా రాణిస్తున్న నటుడు సంపత్ రామ్. ఈయన తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా మలయాళంలో మోహన్లాల్, మమ్ముట్టి తదితర సూపర్ స్టార్లకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. మోహన్ లాల్, సురేష్ గోపి కలిసి నటించిన జనగన్ చిత్రం ద్వారా మలయాళంలో విలన్గా పరిచయమైన సంపత్ రామ్ను మాలీవుడ్ ఆదరించడం విశేషం. తాజాగా మలయాళం సినిమా, రచయితల సంఘం కలిసి మలయాళ పురస్కార సమితి పేరుతో ఉత్తమ కళాకారులను సత్కరిస్తున్నారు. నటుడు దిలీప్ హీరోగా నటించిన తంగమణి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన సంపత్ రామ్ను ఉత్తమ విలన్ అవార్డుకు ఎంపిక చేశారు. దీనిపై తన సంతోషాన్ని వ్యక్తం చేసిన సంపత్రామ్ తాను 25 ఏళ్లుగా నటిస్తున్నాననీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వివిధ రకాల పాత్రలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇతర భాషల్లో లభిస్తున్న ప్రోత్సాహం మాతృభాష అయిన తమిళంలో లభించకపోవడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నవ దర్శకుడు మోసల్ దర్శకత్వంలో నిర్మిస్తున్న వెలుగై చిత్రంతోపాటు ఆర్.కన్నన్ దర్శకత్వంలో ఒక చిత్రం, సాట్టై చిత్ర ఫేమ్ అన్బళగన్ దర్శకత్వం వహిస్తున్న మనిది చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న కన్నప్ప చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు సంపత్ రామ్ తెలిపారు.
నటుడు
సంపత్ రామ్