
చీటీల మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలి
వేలూరు: దీపావళి చీటీల పేరుతో మోసం చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం జరిగింది. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వివిధ శాఖల అధికారులు హాజరై వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా వేలూరు పెరుముగై గ్రామంలోని ఏడో వార్డుకు చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తమ ప్రాంతంలో మొత్తం 11 కుటుంబాలు నివశిస్తున్నామని అయితే తమకు తాగునీటి వసతి, దారి వసతి, విద్యుత్ సరఫరా లేదని తెలిపారు. కాట్పాడి సమీపంలోని వండ్రంతాంగల్ గ్రామానికి చెందిన మహిళలు ఇచ్చిన వినతిలో కమ్మ సముద్రం గ్రామంలోని ప్రవేటు కంపెనీ ఆధ్వర్యంలో తాము దీపావళి చీటీల పేరుతో ప్రతినెలా రూ.1200 చొప్పన ఒక సంవత్సరం పాటు కట్టామని, అయితే మధ్యలోనే కంపెనీ యజమాని మృతి చెందడాడని తెలిపారు. అతని కుమారుడు బాధ్యత తీసుకొని బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపాడన్నారు. అయితే దీపావళి పండుగ ముగిసి ఆరు నెలలు కావస్తున్నా ఇంత వరకు తమకు ఎటువంటి నగదు, బంగారం చెల్లించలేదన్నారు. వీటిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రీవెన్సెల్లో డీఆర్ఓ మాలతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.