
మునీశ్వరర్ ఆలయ మహా కుంభాభిషేకం
పళ్లిపట్టు: షోళింగర్ శివారులోని ఎరుంబిలో ప్రసిద్ధి చెందిన శ్రీతొప్పైయప్పర్, మునీశ్వరర్ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టేందుకు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త భూపాలన్ ముందుకొచ్చారు. అందరి సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి విమాన గోపురంతోపాటు ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి ఆదివారం వరకు రెండు రోజులపాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలు, పుష్పాలు, తోరణాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి, నిత్యహోమ గుండ పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు నిర్వహించారు. మేళ తాళాలు, అశేష భక్తజనం నడుమ పారిశ్రామికవేత్త భూపాలన్, పూంగొడి దంపతుల ఆధ్వర్యంలో పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి విమాన గోపురానికి మహాకుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులపై పుణ్యతీర్థాలు వెదజల్లారు. అనంతరం మునీశ్వరర్కు అభిషేక పూజలు చేపట్టి కర్పూర హారతులిచ్చారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం చేపట్టారు.

మునీశ్వరర్ ఆలయ మహా కుంభాభిషేకం