
నకిలీ పోలీస్ అరెస్టు
తిరువళ్లూరు: పోలీసునంటూ పలువురి వద్ద వసూళ్లకు పాల్పడుతూ బెదిరింపులకు దిగిన నకిలీ పోలీసును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చైన్నెకు చెందిన కరుణానిధి కుమారుడు లక్ష్మణన్(27) పుట్లూరుకు వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం వచ్చినట్టు తెలుస్తుంది. పనులు ముగించుకుని రాత్రి రైలులో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే లాస్ట్ ట్రైన్ మిస్ కావడంతో పుట్లూరు రైల్వేస్టేషన్లో రాత్రి ప్లాట్ఫామ్పైనే నిద్రించి, ఉదయం వెళ్లిపోవాలనుకున్నాడు. పుట్లూరు రైల్వేస్టేషన్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో యువకుడు లక్ష్మణన్పై దాడికి దిగాడు. తాను పోలీసునని, రాత్రి సమయంలో ఇక్కడెందుకు ఉన్నావని దబాయించాడు. అనంతరం అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, డబ్బును లాక్కుకుని తనతో పాటు పోలీసు స్టేషన్కు రావాలని ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని కాకలూరు వైపు వేగంగా వెళ్లాడు. ఈ సమయంలో అక్కడ రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ద్విచక్ర వాహనంలో వేగంగా వస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మధ్యలోనే పరారయ్యాడు. దీంతో అనుమానం కలిగిన పోలీసులు ద్విచక్ర వాహనం వెనుక కూర్చుని ఉన్న లక్ష్మణన్ వద్ద విచారణ చేయగా, అతను పోలీసునంటూ బెదిరింపులకు దిగడంతోపాటు సెల్ఫోన్ లాక్కుకున్నాడని వివరించారు. దీంతో పోలీసులు అతడ్ని వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి తిరుప్పాచ్చూర్ ప్రాంతానికి చెందిన గజేంద్రన్ కుమారుడు సెల్వకుమార్గా గుర్తించారు. ఇతను రాత్రి సమయంలో పోలీసునంటూ బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నట్టు నిర్ధారించి అరెస్టు చేశారు. అనంతరం అతడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.