
మున్సిపల్ సిబ్బంది వేతనానికి రూ. 60 వేల విరాళం
తిరువళ్లూరు: మున్సిపల్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయనున్న ఫిట్టర్కు వేతనం ఇవ్వడానికి 60 వేల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు కౌన్సిలర్ జాన్ ప్రకటించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం బుధవారం ఉదయం ఛైర్ పర్సన్ ఉదయమలర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటూ గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలను చేర్పర్సన్ పరిస్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్ల పాటు పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన పిట్టర్ ఉధయకుమార్ను పలువురు అభినందించారు. కాగా మున్సిపల్ పరిధిలో ఫిట్టర్ ఉదయకుమార్ పదవీ విరమణ చేసిన క్రమంలో ఆయన స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరొకరిని నియమించుకోవాలని తీర్మానించారు. కాగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే పిట్టర్కు ప్రతి నెలా ఐదువేల రూపాయలను వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంవత్సరానికి ఫిట్టర్కు 60వేల రూపాయల ఇవ్వాల్సి వున్న క్రమంలో సంబంధిత మొత్తాన్ని తానే భరిస్తానని డీఎంకే కౌన్సిలర్ జాన్ ఈసందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అరుణ, జాన్, అయూబ్అలీ, థామస్, శాంతి, వసంతి ప్రభాకరన్తో పాటు పెద్ద సంఖ్యలో పలువురు పాల్గొన్నారు.