
ఆలయంలో చోరీకి యత్నం
సేలం: ధర్మపురి జిల్లా, నల్లంపల్లి సమీపంలోని శేషంపట్టి గ్రామంలో పెరియాండిచ్చి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి శనివారం రాత్రి ఒక దొంగ చొరబడ్డాడు. అతను హుండీని పగలగొట్టి డబ్బు దొంగిలించడానికి వచ్చాడు. తరువాత అతను హుండీ లోపలికి చేయి పెట్టి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హుండీలో పెట్టిన చెయ్యి చిక్కుకుపోయింది. దొంగ ఎంత ప్రయత్నించినా, తన చేతిని బయటకు తీయలేకపోయాడు. దీంతో చేసేది లేక రాత్రంతా అలాగే హుండీలో చిక్కుకున్న చేతితో ఉండిపోయాడు. ఈ స్థితిలో ఆదివారం ఆ మార్గంగా వెళ్లిన గ్రామస్తులు హుండీలో దొంగ చేయి పెట్టి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సమాచారం అందుకున్న అధియామన్కోట్టై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అతని వద్ద పోలీసులు విచారించగా.. అతను శేషంపట్టి సమీపంలోని సౌలూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ అని, ఆలయ హుండీలో చోరీకి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడని తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, హుండీని పగలగొట్టి, దొంగ చేయి విడిపించారు. దీంతో తంగరాజును పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత అతడిని కోర్టు ముందు హాజరుపరిచి ధర్మపురి జైలుకు తరలించారు.
మరో ఘటనలో..
విల్లుపురం జిల్లా ముట్టం ప్రాంతంలో గత 22వ తేదీ సంతాన భాగ్యం కోరుతూ ఇంటిలో పరిహార పూజ చేస్తున్నట్టు తెలిపి ఇద్దరు 5 సవర్లు చోరీ చేసినట్టు తెలిసింది. పోలీసుల విచారణలో వేలూరుకు చెందిన వల్లరసు, వల్లియమ్మాళ్లు అని తెలిసింది. వారిద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వల్లియమ్మాళ్ సంఘటనకు ముందు రోజు తేనె విక్రయిస్తున్నట్టుగా వచ్చి, ఇంటిని పరిశీలించిన వెళ్లిందన్నారు. ఆ ఇంటిలో సంతానం లేమితో బాధపడుతున్నారని తెలుసుకుని ఆ విషయాన్ని కుమారుడు వల్లరసుకు తెలిపినట్టు విచారణలో తెలిసింది. తర్వాత తల్లి, కుమారుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు.

ఆలయంలో చోరీకి యత్నం