
కోవైలో రంకెలేసిన వీరత్వం
సేలం : కోయంబత్తూరు చెట్టిపాళయం జల్లికట్టు పోటీలను మంత్రి సెంథిల్ బాలాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ జల్లికట్టు పోటీలో 800 ఎద్దులు, 500 మంది వీరులు పోటీపడ్డారు. కోయంబత్తూరు చెట్టిపాళయం బైపాస్ రోడ్డులో ఈ పోటీని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోటీలో పాల్గొనాల్సిన ఎద్దులు, క్రీడాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి పోటీలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. అంతకుముందు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సమక్షంలో వీరులు జల్లికట్టు ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఎద్దుల పోటీదారులు ఎద్దుల యజమానులు అన్ని ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటించాలని ఆదేశించారు.
ఇంకా మద్రాస్ హైకోర్టు మార్గదర్శకాలను పాటించేలా చూసుకోవడానికి మొత్తం జల్లికట్టు పోటీని వీడియో రికార్డ్ చేశారు. ఈ జల్లికట్టు పోటీలను వీక్షించడానికి ప్రజలకు వీక్షణ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా వీరులకు గాయాలు అయితే తక్షణ చికిత్స అందించడానికి సాధారణ వైద్య బృందాలు, పశువైద్య బృందాలు సిద్ధంగా ఉంచారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో 300 మందికి పైగా పోలీసు సిబ్బందిని భద్రతా పనుల కోసం నియమించారు. కోయంబత్తూరు కార్పొరేషన్ కమిషనర్, కోవై, పొల్లాచి పార్లమెంటు సభ్యులు, కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన వీరులు, ఎద్దుల యజమానులకు కారు, బైక్లు, గృహోపకరణాలు వంటి పలు బహుమతులుగా అందజేశారు. కాగా ఈ ప్రాంతంలో జల్లికట్టు పోటీలు 4 సంవత్సరాల తర్వాత నిర్వహించడం గమనార్హం. దీంతో చుట్టు పక్కల పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
ఆకట్టుకున్న జల్లికట్టు పోటీలు