
భారీ బడ్జెట్ చిత్రాలు బ్రహ్మాండం కావు
తమిళసినిమా: ది చూసెన్ ఒన్ పతాకంపై అబు కరీమ్ ఇస్మాయిల్ రూపొందించిన వెబ్ సీరీస్ డార్క్ ఫేస్. దీని ద్వారా సంగీత దర్శకుడు చరణ్ ప్రకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు పదికిపైగా చిత్రాలకు 15కు పైగా మ్యూజికల్ వీడియోలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఈ వెబ్సీరీస్కు చరణ్ ప్రకాశ్నే సంగీతాన్ని అందించారు. సీనియర్ వైజీ.మహేంద్రన్ న్యాయవాదిగా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో ఆయన కూతురు వైజీ.మధువంతి ముఖ్యపాత్రలో నటించారు. వీరితో పాటు విజయ్ టీవీ కేఆర్వై రాజవేల్, సౌమ్య, నిర్మాత అబుకరీమ్ ఇస్మాయిల్, యశ్వంత్, శక్తి, సునిల్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా 7 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ వెబ్ సీరీస్ టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం చైన్నెలోని వాణిమహల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు లింగుసామి పాల్గొని ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. వైజీ.మహేంద్రన్ మాట్లాడుతూ ఈ వెబ్సిరీస్ను దర్శకుడు చరణ్ప్రకాశ్ చాలా అద్భుతంగా రూపొందించారన్నారు. ఆయన చెప్పిన కథే బ్రహ్మాండంగా ఉందన్నారు. రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన చిత్రాలు బ్రహ్మాండం అని చెబితే తాను నమ్మనన్నారు. సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఉండాలన్నారు. ప్రేక్షకుల మనసులో ఎంతగా గుర్తుండిపోతుందో అదే బ్రహ్మాండ చిత్రం అన్నారు. వెబ్ సీరీస్ కథ సస్పెన్స్ థ్రిల్లర్తో కూడిన ఇన్వెస్టిగేషన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కోర్టులో నేరస్తుడిగా ఉరిశిక్షను పొందిన వ్యక్తి ఆ తరువాత తాను నిరపరాధినని నిరూపించుకోవడానికి చేసే పోరాటమే ఈ వెబ్ సీరీస్ ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. అతనికి శిక్ష వేయించిన తానే ఆ తరువాత అతన్ని నిరపరాధిగా నిరూపించడానికి ప్రయత్నిస్తానని వైజీ.మహేంద్రన్ చెప్పారు.