
‘కలైంజ్ఞర్’ పేరుతో వర్సిటీ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగై, పీఎంకే శాసన సభా పక్ష నేత జీకే మణి, వీసీకే సభ్యుడు చింతనై సెల్వన్, సీపీఎం సభ్యుడు వీపీ నాగై మాలి, సీపీఐ సభ్యుడు రామచంద్రన్, డీఎంకే సభ్యుడు డాక్టర్ సాధన్ తిరుమలైకుమార్, మనిద నేయ మక్కల్ కట్చి సభ్యుడు జవహిరుల్లా, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి సభ్యుడు ఈశ్వరన్, తమిళర్ వాల్వురిమై కట్చి సభ్యుడు వేల్ మురుగన్లు సభా నిబంధనలు 55 ప్రకారం ఓ ప్రత్యేక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. స్పీకర్ అప్పావు అనుమతి ఇవ్వడంతో ఆయా సభ్యులు ప్రసంగించారు. రాష్ట్రంలో దివంగత నేతలు పెరియార్, కామరాజర్, అన్నా, ఎంజీఆర్, జయలలితల పేరిట ఉన్న వివిధ విశ్వ విద్యాలయాల గురించి ప్రస్తావించారు. వీరి సేవలకు గుర్తింపుగా విద్యా పరంగా వర్సిటీలకు పేర్లు పెట్టి గౌరవించి ఉన్నారని గుర్తు చేశారు. తమిళనాడులో గొప్ప రాజకీయ మేధావిగా జీవించి విద్యా వ్యాప్తికి, తమిళ ఖ్యాతికి ఎనలేని సేవలు అందించిన కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట ఓ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
కుంభకోణంలో..
సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన సీఎం స్టాలిన్ ప్రసంగించారు. సభ్యులు చేసిన విజ్ఞప్తి, సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులోని పాఠశాలలు, కళాశాలలు అన్నీ నేడు అత్యున్నత స్థాయిలో సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన నేత దివంగత కలైంజ్ఞర్ కరుణానిధి అని కొనియాడారు. విశ్వవిద్యాలయాలకే విశ్వవిద్యాలయం అనేలా కరుణానిధి మేధస్సు ఉండేదని, త్వరలో అందరి విజ్ఞప్తి కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కలైంజ్ఞర్ జన్మించిన నాటి సమైఖ్య తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంలో ఈ వర్సిటీని జీకే మణి చెప్పినట్టుగానే ఎలాంటి సంకోచం అన్నది లేకుండా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుంభకోణంలో త్వరలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించబడుతుందని, దీనికి కలైంజ్ఞర్ పేరు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ దృఢమైన సందేశాన్ని ఎలాంటి సంకోచం లేంకుడా మళ్లీ పునరావృతం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కలైంజ్ఞర్ పేరిట వర్సిటీ అన్న ప్రకటనను సీఎంస్టాలిన్ చేస్తున్న సమయంలో సీనియర్మంత్రి దురై మురుగన్ భావోద్వేగానికి గురయ్యారు.
కుంబకోణంలో కరుణ పేరిట ఏర్పాటు
అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటన
చైన్నెలో రూ.40 కోట్లతో పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రం
డీఎంకే దివంగత నేత, మాజీ సీఎం కలైంజ్ఞర్ ఎం. కరుణానిధి పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. కుంభకోణంలో ఈ వర్సిటీని నెలకొల్పి తీరుతామని అసెంబ్లీ వేదికగా గురువారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దీనిని అన్ని పార్టీలూ ఆహ్వానించాయి.
యువత కలల్ని సాకారం చేయడమే లక్ష్యం
యువత కలలను నిజం చేయడమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన జరుగుతోందని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీలో సభ్యు ఎ. వెట్రి అళగన్ నాన్ మొదల్వన్ ప్రాజెక్టు గురించి, యూపీఎస్సీలో అభ్యర్థులు సాధించిన ఘనతను సభ ముందు వివరిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, నాన్ మొదల్వన్ ప్రాజెక్టు గురించి మరికొన్ని వివరాలను తెలియజేశారు. యూపీఎస్సీలో విజయం సాధించిన విద్యార్థులందర్నీ అభినందిస్తూ, ప్రశంసలు కురిపించారు. సివిల్స్కు సిద్ధమయ్యే విద్యార్థులకు నెలకు రూ. 7500, ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ. 25 వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం తమిళనాడు నుంచి 57 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఇది శుభవార్త అని వ్యాఖ్యానించారు. ఈ సంఖ్యను రానున్న కాలంలో పెంచడం లక్ష్యంగా చైన్నెలో 500 మంది విద్యార్థులు శిక్షణ పొందే దిశగా రూ. 40 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన వారందర్నీ సత్కరించడం జరుగుతుందన్నారు. అత్యుత్తమ తమిళుడు రూపకల్పన, యువత కలలను నిజం చేయడమే ద్రావిడ మోడల్ పాలన లక్ష్యం అని ధీమా వ్యక్తం చేశారు.
విద్యకు పెద్దపీట
అసెంబ్లీలో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలకు 2025–26 ఆర్థిక బడ్జెట్లో నిధుల కేటాయింపునకు సంబంధించిన పద్దుల వివరాలు సభకు చేరాయి. పాఠశాల విద్యాశాఖ పద్దుల వివరాలను ఆశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ సభలో దాఖలు చేశారు. పాఠశాల విద్యా శాఖకు రూ. 46,766 కోట్లను బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిధులతో చేపట్టనున్న వివిధ విద్యా పథకాలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపట్టబోతున్న ప్రాజెక్టులను గురించి విశదీకరించారు. ఉన్నత విద్యా శాఖకు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కోవి చెలియన్ సభలో దాఖలు చేసి ఉన్నత విద్యకు అందలం వేస్తూ చేపట్టిన పథకాలు, విద్యా కార్యక్రమాలను వివరించారు. ముందుగా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు, రఘుపతి, ఎంఆర్కే పన్నీరు సెల్వం, గణేషన్, శివశంకర్, టీఆర్బీ రాజ సమాధానం ఇచ్చారు. మంత్రి రఘుపతి మాట్లాడుతూ, జిల్లాలకు ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ప్రభుత్వానికి ఉందని, అయితే, అందుకు తగ్గ నిధుల కొరత కారణంగా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ మాట్లాడుతూ, కోయంబత్తూరు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటి పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. టీఆర్బీ రాజ పేర్కొంటూ, తమిళనాడు నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి పెరిగిందని, అన్ని రకాల ఎగుమతులు విస్తృతమయ్యాయని ప్రకటించారు. ఏవీ వేలు మాట్లాడుతూ, మదురవాయిల్ నుంచి శ్రీపెరంబదూరు వరకు రూ. 1400 కోట్లతో హై లెవల్ వంతెన మార్గం పనులు చేపట్టనున్నామన్నారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ, శిరువా పురి మురుగన్ ఆలయంతో పాటూ తమిళ్ కడవుల్ మురుగన్ ఆలయాలన్నింటిలోనూ రూ.1085 కోట్లతో 884 పనులు జరుగుతున్నాయని వివరించారు. పార్ట్ టైం టీచర్ల పర్మినెంట్పై పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. 12,110 పంచాయతీలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు. 309 శిబిరాల ద్వారా 24,9392 మందికి ఉద్యోగ నియామకాల ఉత్తర్వులు దక్కే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి సీవీ గణేషన్ పేర్కొన్నారు. రేషన్ దుకాణాలలో 99.60 శాతం బయోమెట్రిక్ ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణి జరుగుతున్నట్టు మంత్రి చక్రపాణి సభకు వివరించారు. సభలో స్పీకర్ అప్పావు స్పందిస్తూ ప్రశ్నలకు అవును..కాదు అన్న సమాధానాల దిశగా యాప్ రూపకల్పన చేస్తున్నట్టు చమత్కరించారు. డాక్యుమెంట్ల అమ్మకాల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 72 వేల కోట్ల ఆదాయం డీఎంకే అధికారంలోకి వచ్చినట్టు మంత్రి మూర్తి ప్రకటించారు.

‘కలైంజ్ఞర్’ పేరుతో వర్సిటీ