
బృహదీశ్వరాలయంలో బ్రహ్మోత్సవం
● ధ్వజారోహణంతో ప్రారంభం ● మే 7న రథోత్సవం ● 29 నుంచి మదురైలో చిత్తిరై ఉత్సవాలు
సాక్షి, చైన్నె: ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయంలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ఈ ఉత్సవాలకు బుధవారం ధ్వజారోహణం జరిగింది. కళలకు కానాచి తంజావూరు. ఇక్కడి కళలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఇక, ఇక్కడి బృహదీశ్వరాలయం చోళ రాజుల భక్తికి ప్రతిరూపం. బిగ్ టెంపుల్గా పిలవబడే ఈ ఆలయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన బిగ్ టెంపుల్ చిత్తిరై రథోత్సవ సంబరాల బ్రహ్మోత్సవం ఏటా కోలాహలంగా జరుగుతుంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు బుధవారం వేకువ జాము నుంచి ఆలయంలో జరిగిన పూజలతో శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక రోజూ చిత్తిరై బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరగనున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు పర్యాటకులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం ఉత్సవాల నేపథ్యంలో ఆయల పరిసరాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు, పర్యాటకుల కోసం తంజావూరు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం మే 7వ తేదీ జరగనుంది. ఇక్కడ జరిగే రథోత్సవ వేడుకను తిలకించేందుకు తంజావూరు, తిరువారూర్, అరియలూరు, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై, తిరుచ్చి జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తుల తరలి రావడం జరుగుతుంది. త్యాగరాజ స్వామి, కమలాంబాల్ (శివ పార్వతులు)లు ఒక రథంలో, వినాయకుడు, అసురదేవుడు, వల్లి, దైవాను, మురుగన్, నీలోత్తమన్, చండీశ్వరర్ వేర్వేరు రథాలలో భక్తులకు ఈ చిత్తిరై రథోత్సవ సంబరంలో దర్శనం ఇవ్వడం జరుగుతంది. ఇక్కడి స్వామి అమ్మవారి రథం 49 అడుగులతో గంభీరంగా కనిపిస్తుంటుంది. రథోత్సవం కోసం ఈ రథాన్ని ముస్తాబు చేస్తున్నారు.
29న మదురైలో ఉత్సవాలకు శ్రీకారం
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలకు ఈనెల 29వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. మే 3వ తేదీన అమ్మవారి పట్టాభిషేకం, 4వ తేదిన మీనాక్షి కల్యాణం, 5వ తేదీన రథోత్సవ వేడుకలు జరగనున్నాయి. మే 7వ తేదిన అలగర్ వైగై నదీ ప్రవేశం లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరగనుంది. ఇందుకోసం మదురైలో ఏర్పాట్లు మొదలయ్యాయి. అలాగే, కళ్లకురిచ్చి ప్రసిద్ధి చెందిన హిజ్రాల ఆరాధ్య దైవం కూత్తాండవర్ ఆలయ చిత్తిరై ఉత్సవాలు కూడా ఈనెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలలో అత్యంతముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి మే 13వ తేదీన జరగనుంది.