తండ్రీ కొడుకుల కథ మాత్రమే కాదు
తమిళసినిమా: తెలుగు నటుడు ధన్రాజ్ కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం రామమ్ రాఘవమ్. సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి మోక్ష నాయకిగా నటించారు. నటుడు సునీల్, హరీశ్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని స్లేట్ అండ్ పెన్సిల్ పిక్చర్స్ పతాకంపై పృథ్వీ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం(21వ తేదీన) తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ వేడుకలో సముద్రఖని హీరోగా నటించిన చిత్రాల దర్శకులు అన్బళగన్, మణిమారన్, సుబ్రమణియ శివ, స్టంట్ సిల్వ, ప్రాంక్లిన్, నందా పెరియసామి, జయప్రకాశ్, నటుడు తంబిరామయ్య, మలయన్ గోపీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పృథ్వీ మాట్లాడుతూ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. దర్శకుడు, కథానాయకుడు ధన్రాజ్ మాట్లాడుతూ సముద్రఖని అన్నకు చాలా ధన్యవాదాలు అన్నారు. ఆయనే తన భుజం తట్టి ఇక్కడి వరకూ తీసుకొచ్చారన్నారు. సముద్రఖని ఇప్పటి వరకూ తండ్రి పాత్రల్లో 21 చిత్రాలు చేశారని, అలా ఈ చిత్రం 21న తెరపైకి రావడం యాదృచ్ఛికమే అయినా సంతోషంగా ఉందన్నారు. తనకు తండ్రి లేరని, ఈ చిత్రం ద్వారా సముద్రఖని లాంటి తండ్రి లభించారని పేర్కొన్నారు. నటుడు సముద్రఖని మాట్లాడుతూ ధన్రాజ్ ఇంతకు ముందు తెలుగులో 100 చిత్రాలకు పైగా నటించారన్నారు. తనకు సంబంధించిన సన్నివేశాల్లో నటించిన తరువాత కూడా దర్శకులు, ఇతర సాంకేతిక వర్గం పనిని గమనించేవారన్నారు. కాగా ఆయన చెప్పడంతోనే తాను విమానం చిత్రంలో నటించానని, ఈ చిత్ర కథను ఒక చిత్ర షూటింగ్లో కెరవన్ నుంచి స్పాట్కు వెళుతున్న నిమిషంన్నర గ్యాప్లో చెప్పారన్నారు. కథ నచ్చడంతో తాను నటిస్తానని చెప్పానన్నారు. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ మాత్రమే కాదని, అంతకు మించిన స్ట్రాంగ్ పాయింట్ ఉందని, ఈ చిత్రంలోని సంఘటనలు తమిళనాడులోనూ 15 వరకూ జరిగాయని చెప్పానన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో జీఆర్ఆర్ మూవీస్ అధినేత రఘు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.