గుండెపోటుతో
ఖైదీ హఠాన్మరణం
అన్నానగర్: మదురై సెంట్రల్ జైలులో ఖైదీ మంగళవారం హఠాన్మరణం చెందాడు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ధర్మర్ (52) హత్య కేసులో అరెస్టు అయి మదురై సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా ధర్మర్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా కౌన్సిలర్
దారుణ హత్య
అన్నానగర్: డీఎంకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైన ఘటన కరూర్లో బుధవారం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా కొడుమూడి సమీపంలోని చోళ కాళిపాళయం గ్రామానికి చెందిన తంగరాసు (57) ఆ ప్రాంతంలో కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య రూప (42), ఇద్దరు కొడుకులు ఉన్నారు. రూప డీఎంకే కౌన్సిలర్గా ఉన్నారు. కరూర్లో టెక్స్టైల్ ఎగుమతి కంపెనీ యజమాని ఇంటిలో పని చేస్తోంది. మంగళవారం ఎప్పటిలాగే ఇంటి నుంచి బయలుదేరి కరూర్ వచ్చిన రూప ఆ రాత్రి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ గాలించినా ఆచూకీ తెలియరాలేదు. బుధవారం కరూర్ జిల్లా పరమతి మురుగన్ దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో రూప తల తీవ్ర గాయాలతో శవమై కనిపించింది. ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాము కాటుకు మహిళ మృతి
తిరువళ్లూరు: పాముకాటుకు పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికురాలు మృతి చెందింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాశీపూర్కు చెందిన సుమారు 20 మంది వలస కార్మికులు తిరువళ్లూరు జిల్లా మంజాకారనైలో నివాసం ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం యథావిధిగా వరినాటుకు వెళ్లి రాత్రి ఇంట్లో నిద్రించారు. రాత్రి 11 గంటల సమయంలో సుఖీబేష్రాను పాము కాటు వేసింది. సహచర కార్మికులు ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు బబ్లూముర్ము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి ..
తిరువళ్లూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రైవేటు సంస్థకు చెందిన నౌకయాన ఉద్యోగి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు పట్టణం పెద్దకుప్పం గ్రామానికి చెందిన ముత్తు కుమారుడు భాస్కరన్(43). ఇతనికి భార్య మంజులతో పాటు పిల్లలు ఉన్నారు. భాస్కరన్ ముంబయిలోని ప్రైవేటు షిప్లో పని చేస్తున్నాడు. వారం రోజుల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చిన భాస్కరన్ వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం రాత్రి పెద్దకుప్పం బ్రిడ్జి వద్ద నిలబడి ఉన్న సమయంలో గుర్తు తెలియని వాహానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చిక్సిత నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ నుంచి పడి..
అన్నానగర్: చైన్నె సమీపంలో మంగళవారం సాయంత్రం స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ నుంచి కిందపడిన మహిళ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలు.. చైన్నెలోని పెరవళ్లూరు ప్రాంతానికి చెందిన పద్మావతి (54). ఆమె కుమారుడు కన్నన్ (27). వీరిద్దరూ మంగళవారం సాయంత్రం కూరగాయలు కొనేందుకు కోయంబేడుకు బైకుపై వచ్చారు. మార్కెట్ సమీపంలోని ఎ.రోడ్డుపైకి వచ్చి రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ను గమనించకుండా వేగంగా ఎక్కడంతో బైక్ వెనుక కూర్చున్న పద్మావతి కిందపడిపోయింది. ఈ క్రమంలో తల వెనుక భాగంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర చికిత్స పొందుతూ బుధవారం ఉదయం పద్మావతి మృతి చెందింది. కోయంబేడు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీటింగ్ కేసులో యువకుడి అరెస్టు
అన్నానగర్: ఉలుందూరుపేటలో చీటిలు నిర్వహించి రూ.5 లక్షలు మోసం చేసిన యువకుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కల్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేట సమీపంలోని ఎరయూర్ గ్రామానికి చెందిన మరియదాస్. ఇతను, అతని కుమారుడు అంథోని సెల్వరాజ్ (35) వేలం, దీపావళి చీటి నిర్వహించారు. అదే పట్టణానికి చెందిన పీటర్పాల్, ఆరోన్ 2021, 2022లో దీపావళి చీటి, వేలం చీటి రూ.5.19 లక్షలు కట్టారు. అయితే ఆ తరువాత మరియాదాస్, ఆంథోని సెల్వరాజ్లు చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో ఆగ్రహించిన పీటర్పాల్, ఆరోన్లు కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి బుధవారం ఆంథోని సెల్వరాజ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరియదాసు కోసం గాలిస్తున్నారు.