రైతు ప్రయోజనాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు ప్రయోజనాలే లక్ష్యం

May 26 2025 1:31 AM | Updated on May 26 2025 1:55 AM

రైతు ప్రయోజనాలే లక్ష్యం

రైతు ప్రయోజనాలే లక్ష్యం

వారికి ఆర్థికంగా లబ్ధి

చేకూర్చేలా ప్రణాళికలు

పెద్ద ఎత్తున రుణ సదుపాయం,

జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1,100 కోట్లు

గతేడాది కంటే రూ.483 కోట్ల

అదనపు రుణాలు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాసరెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తృతం చేశామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు ద్వారా ఇచ్చే రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1917లో ప్రారంభమైన డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

గతంలో కంటే రుణ లక్ష్యం పెంపు

బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలతోపాటు వ్యవసాయేతర, దీర్ఘకాలిక రుణాలను కూడా ఇస్తున్నాం. గతంలో కంటే ఈసారి రుణాల లక్ష్యాన్ని పెంచాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.483 కోట్లు అదనంగా ఇవ్వబోతున్నాం. 2023–24లో బ్యాంకు ద్వారా అన్ని రకాల రుణాలు రూ.344 కోట్లు ఇవ్వగా, 2024–25లో రూ.783 కోట్లు ఇచ్చాం. అందులో వ్యవసాయ రుణాలు రూ.100 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.181 కోట్లు, వ్యవసాయేతర రుణాలు రూ.206 కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.296 కోట్ల రుణాలను ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో అన్ని రకాల రుణాలను గతంలో కంటే పెంచాం. వ్యవసాయ రుణాలను రూ.150 కోట్లు, దీర్ఘకాలిక రుణాలను రూ.250 కోట్లకు, వ్యవసాయేతర రుణాలను రూ.300 కోట్లకు, బంగారు ఆభరణాలపై రుణాలను రూ.400 కోట్లకు పెంచాం. గతంలో కొత్త సభ్యులకు స్వల్పకాలిక పంట రుణాలను రూ.40 కోట్ల వరకే ఇచ్చే వారు. దానిని గతేడాది రూ.100 కోట్లకు పెంచాం. ఈసారి మరింత పెంచుతాం.

మరో 6 కొత్త శాఖలు

ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్‌, గరిడేపల్లి, నారాయణపూర్‌, దామరచర్లలో కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్‌బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

రైతులకు డ్రోన్ల సహకారం

రైతులకు బ్యాంకు సేవలను మరింత విస్తతం చేయబోతున్నాం. డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. బ్యాంకు పరిధిలోని 108 సహకార సంఘాల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. వాటిని ఈ వానాకాలం సీజన్‌లోనే అందజేస్తాం. బయటి మార్కెట్‌ కంటే తక్కువ ఖర్చుతో రైతులు వరి, పత్తి చేలకు పురుగు మందులను పిచికారి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement