
కోవిడ్ అప్రమత్తతపై నిర్లక్ష్యం
● జిల్లాకు చేరని పరీక్ష కిట్లు ● అందుబాటులో లేని మందులు
శ్రీకాకుళం: కోవిడ్ అప్రమత్తతపై ప్రభు త్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో పది పడకల వార్డును ఏర్పాటు చేసినప్పటికీ వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని పరీక్షించేందుకు కిట్లు లేవు. నాలుగేళ్ల కిందట తెప్పించి మిగిలిపోయిన కిట్లతో ప్రస్తుతం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తే వ్యాధి నిర్ధారణ కాదని, ఫలితాలు తప్పుగా వస్తున్నాయని పక్కన పడేశారు. ఇప్పుడు కిట్లు సరఫరా కాకపోవడంతో మరో గత్యంతరం లేక పాత కిట్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు గానీ, మాస్క్లు గానీ, నోడల్ బృందాలు గానీ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు గానీ చేపట్టడం లేదు. ఇది ప్రమాదకమైన పరిస్థితులకు దారితీస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మండల స్థాయిలో కాకుండా, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ప్రస్తుత వేరియంట్ ప్రమాదకరం కాదంటూనే గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు ఈ వేరియంట్ వల్ల ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పరీక్ష కిట్లు, మందులు, మాస్క్లు, శానిటైజర్లు జిల్లాకు, మండల కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలను అవగాహన కలిగిస్తూ, అప్రమత్తం కలిగించాలని కోరుతున్నారు.
కిట్లు తెప్పిస్తున్నాం
జిల్లాకు ఒకటి, రెండు రోజు ల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్ష కిట్లు వస్తాయి. పాత కిట్లు సుమారు 2500 వరకు ఉన్నాయి. మాస్క్లు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కలిగించేలా తగిన చర్యలు తీసుకున్నాం. గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వెళ్లి అప్రమత్తం చేస్తున్నారు.
– డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
అధికారి, శ్రీకాకుళం

కోవిడ్ అప్రమత్తతపై నిర్లక్ష్యం