
ఆదివారమైనా బాధ్యతలు స్వీకరించాల్సిందే
● హెచ్ఎంలుగా పదోన్నతి పొందినవారు నేడు విధుల్లో చేరిక
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విధుల్లో చేరనున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లలో ఇటీవల 83 మంది స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. వీరికి గత నెల 29న శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆరోజు ఉదయం 10 గంటలకు మొదలువకావాల్సిన ఆన్లైన్ కౌన్సెలింగ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు మాన్యువల్ విధానంలో పూర్తిచేసిన ఉదంతం విదితమే. కాగా ఆరోజు హెచ్ఎంలగా పదోన్నతి పొందిన వారంతా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించి, విధుల్లో చేరాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ 83 మందిలో జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో 80మంది, మున్సిపల్ ఇద్దరు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరు ఉన్నారు. వీరంతా శనివారం పాత పాఠశాలల నుంచి రిలీవ్ అయ్యారని డీఈఓ తిరుమల చైతన్య పేర్కొన్నారు.