
సొమ్ము అందరిదీ.. సోకు టీడీపీ నాయకుడిది!
ఇదేం తీరు?
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు చేయకుండా పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. ఎండోమెంట్ నిధులతో పాటు 250 కుటుంబాలు ఇంటికి రూ. 5వేలు చొప్పున్న ఇచ్చారు. దాతల సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకుంది. వీటిని విస్మరించి స్థానిక టీడీపీ నేత శివప్రసాద్ ఆలయ ధర్మకర్తగా కరపత్రాలు వేయించుకోవడం ఎంత వరకు సమంజసం? సొంత పార్టీ వాళ్లే ఛీ కొడుతున్నారు. – అంగ లక్ష్మి జనార్దన్, సర్పంచ్,
కాపుగోదాయవలస
సంతబొమ్మాళి: అధికార పార్టీ నాయకులు పబ్లిసిటీ కోసం దేవుడినీ వదలడం లేదు. దేవదాయ శాఖ నిధులు, దాతల సహాయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న రామాలయానికి అన్నీ తానేనంటూ ఆలయ ధర్మకర్తగా టీడీపీ నాయకుడు కుత్తుమ శివప్రసాద్ కరపత్రం వేయించుకోవడంపై దాతలు, గ్రామస్తులు మండి పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం కాపుగాదాయవలసలో రూ.1,50,000 సంఘం డబ్బులతో రామాలయ నిర్మాణానికి 2015వలో పునాది వేశారు. ఆలయ నిర్మాణానికి రూ.15లక్షలు అవసరం కావడంతో సర్పంచ్ అంగ లక్ష్మితో పాటు గ్రామస్తులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సహాయంతో అప్పటి దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను, ఎండోమెంట్ అధికారులను సంప్రదించారు. ఆలయ నిర్మాణానికి ఎండోమెంట్ నిధులు మంజారు కావాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అధికారులు తెలియజేశారు. దీంతో గ్రామానికి చెందిన వాడరేవు సింహాచలం తన సొంత డబ్బులు రూ.3లక్షలు ఎండోమెంట్ ఖాతాలో జమ చేశారు. దీంతో 2023 నవంబర్లో రూ.15లక్షలు ఎండోమెంట్ నిధులు (ఆర్సీ నె.ఏ4/476702/2023)మంజూరయ్యాయి. దీంతో స్థానిక సర్పంచ్ భర్త అంగ జనార్దన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 70 శాతం ఆలయ నిర్మాణ పనులను సొంత డబ్బులతో పూర్తి చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
మరికొద్ది రోజుల్లో మిగతా బిల్లులు మంజూరవుతాయనగా.. ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు బిల్లులు చెల్లించకుండా నిలిపి వేశారు. దీంతో మిగిలిన పనులను పూర్తి చేయడానికి గ్రామస్తులే రంగంలోకి దిగారు. దీన్ని కూడా పోలీసుల సహాయంతో టీడీపీ నాయకులు నిలుపుదల చేయించారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ బాధ్యతలు టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రామంలో ఉన్న సుమారు 250 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం రూ.5వేలు చొప్పున్న విరాళంగా అందజేశారు. పలువురు దాతలు ఆలయ ధ్వజస్తంభం, రెండు కిలోల వెండి, గ్రానైట్, టైల్స్ను అందించారు. వీరందరి సహాయంతో గ్రామంలో రామాలయం నిర్మాణం పూర్తిచేసుకుని జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు ప్రతిష్టాపనోత్సవాలకు సిద్ధమయ్యింది.
వెల్లువెత్తిన విమర్శలు..
స్థానిక టీడీపీ నాయకుడు కుత్తుమ శివకుమార్ రామాలయం నిర్మాణం తన ఖాతాలో వేసుకోవడానికి పన్నాగం పన్నాడు. ఏకంగా ఆలయ ధర్మకర్తగా తన పేరుతో కరపత్రాలను ముద్రించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాడు. వీటిని చూసిన గ్రామస్తులు, దాతలతో పాటు సొంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దేవున్ని కూడా ప్రచారానికి వదల్లేదంటూ సొంత పార్టీ నాయకులే బహిరంగ విమర్శిస్తున్నారు.
దేవదాయశాఖ నిధులు, దాతల సహాయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయం
ఆలయ ధర్మకర్తనంటూ కరపత్రం వేయించుకున్న టీడీపీ నేత శివప్రసాద్
మండిపడుతున్న దాతలు, గ్రామస్తులు

సొమ్ము అందరిదీ.. సోకు టీడీపీ నాయకుడిది!