
దినసరి వేతనదారులపై నివేదిక సిద్ధం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పనిచేసిన 49 మంది దినసరి వేతనదారుల సమస్యకు మరికొద్ది రోజుల్లో శాశ్వత పరిష్కారం లభించనుంది. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే దినసరి వేతనదారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించేసి..అందర్నీ విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీతాల చెల్లింపు పూర్తి చేసి అవసరమైన సిబ్బంది సంఖ్య ఖరారు చేసేందుకు విశాఖపట్నం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్పట్నాయక్, ఆలయ ఈవో వై.భద్రాజీలతో కూడిన త్రీమెన్ కమిటిని నియమించారు. వీరు గురువారం విశాఖపట్నంలో సమావేశమై కీలక నిర్ణయాలను నివేదిక రూపంలో సిద్ధం చేశారు. దీని ప్రకారం దినసరి వేతనదారుల సంఖ్యను ఖరారు చేసిన తర్వాత రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఆ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. అరసవల్లిలో తొలిసారిగా ఔట్సోర్సింగ్ సేవలను రంగంలోకి దించనున్నారు. ప్రస్తుతానికి విధుల్లో ఉన్న 49 మందిలో 15 మంది మినహా మిగిలిన వారికి ఉద్వాసన తప్పదని దాదాపుగా తేలిపోయింది. ఈ అంశంపై విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సుజాత వద్ద సాక్షి ప్రస్తావించగా.. త్రిమెన్ కమిటీ సమావేశం ముగిసిందని, ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో.. అనే విషయమై నివేదికను రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్కు సోమవారం పంపించనున్నట్లు స్పష్టం చేశారు.