
అమరుల స్మారక సభ నిర్వహణపై నిషేధాజ్ఞలు
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి గుర్తుగా స్మారక సభ నిర్వహణపై కాశీబుగ్గ పోలీసులు ఉక్కుపాదం మో పారు. కాశీబుగ్గ డీఎస్పీ ఆదేశాల మేరకు నిషేధాజ్ఞలు విధించారు. దీంతో మంగళవారం ఉదయం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద జరగాల్సిన ఈ సభను రద్దు చేశా రు. 1969లో జరిగిన జిల్లా గిరిజన రైతాంగ సాయుధపోరాటంలో సుమారు 360 మంది అప్పటి పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. జిల్లా ఉద్యమ నిర్మాత పంచాది కృష్ణమూర్తి కలకత్తాలో జరిగిన కేంద్రకమిటీ సమావేశం నుంచి తిరిగి వస్తుండగా 1969 మే 27న పోలీసుల చేత చిక్కి మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఆరుగురు కూడా మృతి చెందారు. జిల్లా సాయుధ పోరాటం ముగిసిన తర్వాత అమరవీరుల జ్ఞాపకార్థం 1990లో గ్రామస్తులు, వివిధ విప్లవ పార్టీల ఆధ్వర్యంలో కూడిన స్మారక మందిరం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం నిర్మించారు. ఏటా మే 27న అమరుల స్మారక సభ నిర్వహిస్తున్నారు. ఈ యేడు మాత్రం పోలీసులు అడ్డు చెప్పారు. సోమవారం రాత్రి నుంచి బొడ్డపాడులో పోలీసులు నిఘా వేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో వచ్చి అమరవీరుల స్మారక మందిరం వద్ద తిష్టవేశారు. దీంతో బొడ్డపాడు మాజీ సర్పంచ్ తామాడ త్రిలోచనరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, మద్దిల రామారావు, వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు తదితరులు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు వద్దకు అనుమతి కోసం వెళ్లారు. కానీ ఆయన అనుమతి నిరాకరించారు. సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కూడా స్మారక మందిరంలో ఉన్న ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను బయటకు పంపేశారు.