
కారుని ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఇద్దరికి తీవ్రగాయాలు
రణస్థలం: మండలంలోని దన్నానపేట కొత్త పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న కారును అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒక ఫంక్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లి అటునుంచి ద్విచక్ర వాహనంపై అన్నదమ్ములు సున్నపల్లి బోయోడు, బుల్లోడు వస్తున్నారు. దన్నానపేట పెట్రోల్ బంకు సమీపంలో కొత్తగా జంక్షన్ ఏర్పాటు చేయడంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మలుపు తిరుగుతున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ ఎగిరిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇరువురినీ 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి అన్నదమ్ములు పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందినవారు. సరికొత్త స్పోర్ట్స్ బైక్ కావడం అతివేగంగా వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా బైకు నంబర్ కూడా రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.