
తీవ్ర నిరాశ
నంబాల కుటుంబ సభ్యులకు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కుటుంబ సభ్యులకు తీవ్ర నిరాశే మిగిలింది. నంబాల మృతదేహం కోసం చత్తీస్గఢ్ వరకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయాసలు పడ్డారు. అక్కడి అధికారుల తీరుతో విసిగిపోయి నారాయణపూర్ వీధుల్లో ప్రజా సంఘాల నేతలతో కలిసి నిరసన ర్యాలీలు కూడా చేశారు. ఏకంగా నారాయణపూర్ ఎస్పీ కార్యాలయం ఎదురుగా నిల్చొని ఆందోళన చేశారు. కానీ ఖాకీలు కారుణ్యం చూపలేదు. మృతదేహం ఇస్తే స్వగ్రామం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకుంటామన్న విజ్ఞప్తిని పెడ చెవిన పెట్టారు. నంబాల మృతదేహానికి పోలీసులు చత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు పూర్తి చేసేశారు. మృతదేహాన్ని అప్పగిస్తే ఊరేగింపులు నిర్వహిస్తారు, స్వగ్రామాల్లో ర్యాలీలు చేస్తారు, అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు నిర్మిస్తారు, ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఇలాంటి చర్యలు మళ్లీ కొందరిని నక్సలిజం వైపు ఆకర్షించే ప్రమాదం ఉందంటూ చత్తీస్గఢ్ పోలీసులు మృతదేహం ఇవ్వడానికి ముందు నుంచే నిరాకరిస్తూ వచ్చారని కేశవరావు సోదరుడు రాంప్రసాద్ వెల్లడించారు.