ఓడీచెరువు (అమడగూరు): అమడగూరు మండల కేంద్రంలో ఆదివారం చౌడేశ్వరీ దేవి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో అమడగూరు జనసంద్రమైంది. అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఉదయం అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేశ్వరి దేవిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. రథం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటలకు అమ్మవారిని అందులో కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి ప్రాంతం నుంచి ఆలయం వరకూ సాగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తిగీతాలతో అలరించారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే క్రిష్టప్ప భక్తులందరికీ ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. పలువురు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త కొత్తపల్లి పొట్టా పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.
భక్తులతో కిటకిటలాడిన అమడగూరు


