
పారిశ్రామిక వాడలో విద్యుత్ సమస్య
కదిరి అర్బన్: అధికారంలోకి వస్తే పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తామన్న కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రగతి మాటను పక్కనపెట్టి ఉన్న పరిశ్రమలూ మూత పడేందుకు కారణమవుతోంది. ఇందుకు కదిరిలోని పారిశ్రామిక వాడనే నిదర్శనం. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పారిశ్రామిక వాడలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటోంది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో ఉన్న పరిశ్రమలు కాస్త మూతేసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు.
రోజూ 15 సార్లు అంతరాయం..
కదిరి పట్టణానికి ఆనుకుని ఉన్న కుమ్మరవాండ్లపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల 25 పరిశ్రమలను ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. కవర్ల తయారీ, వేరుశనగ ప్రాసెసింగ్, బీరువాల తయారీ, సోఫాలు.. కుర్చీల తయారీ, బిందెల తయారీ, పట్టు పరిశ్రమ, ట్రాన్స్ఫార్మర్ల రిపేరు తదితర పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో తీరని అంతరాయంతో పరిశ్రమల నిర్వహణ భారమవుతోందని యజమానులు వాపోతున్నారు. రోజులో 15 సార్లు కరెంటు వచ్చి పోతోందని పేర్కొంటున్నారు. ఒక్కొసారి 5 నుంచి 10 నిమిషాల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటోందని, దీంతో యంత్రాలను ఆపడం ద్వారా ఉత్పత్తి గణనీయంగా తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని వచ్చిన తర్వాత యంత్రాలను ఆన్ చేయబోతుండగా వెంటనే సరఫరా నిలిచిపోతుంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు మరమ్మతుకు లోనై ఆర్థిక భారం మరింత పెరిగి పోతోందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. ప్రతి నెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నా.. నాణ్యమైన విదు్య్త్ను ప్రభుత్వం అందించలేకపోతోందని ఆరోపిస్తున్నారు.
ప్రతి ఐదు నిమిషాలకోసారి
విద్యుత్ సరఫరాలో అంతరాయం
రోజూ రూ.వేలలో నష్టపోతున్నామంటున్న పరిశ్రమల నిర్వాహకులు