వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

May 29 2025 1:17 AM | Updated on May 29 2025 1:17 AM

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు

బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పి తాళలేక ఒకరు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వలస కార్మికుడితో పాటు మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

నల్లచెరువు: స్థానిక వీవర్స్‌ కానీకి చెందిన సుధాకర్‌(45) ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని దిగువపల్లికి చెందిన సుధాకర్‌ తన భార్య అనితతో కలసి వీవర్స్‌ కాలనీలో ఆరేళ్లుగా నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా హిందూపురం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా కడుపు, వెన్ను నొప్పి కారణంగా మెడికల్‌ లీవ్‌ కింద ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరు కుమార్తెలతో కలసి భార్య అనిత తన పుట్టింటికి వెళ్లింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధాకర్‌ పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మక్బూల్‌ బాషా తెలిపారు.

ధర్మవరం రూరల్‌: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన రైతు జ్వాల లక్ష్మీరెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో కుటుంబసభ్యులు ఆరా తీశారు. పొలం వద్దకెళ్లి పరిశీలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం తన పొలానికి సమీపంలో ఉన్న వంకలో కంప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీరెడ్డిని గొర్రెల కాపరులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఉరికి వేలాడుతున్న లక్ష్మీరెడ్డి మృతదేహాన్ని గమనించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం రూరల్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మీరెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సిఉంది.

● ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామ పొలాల్లో బుధవారం మహారాష్ట్రకు చెందిన గణపత్‌ భానుదాస్‌ (41) ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని సుధాఘడ్‌ రాణిఘర్‌కు చెందిన భానుదాస్‌.. భార్యతో కలిసి వలస వచ్చి వెంకటతిమ్మాపురంలో స్థిరపడ్డాడు. కట్టెలు కాల్చి బొగ్గుల వ్యాపారం చేస్తుండేవారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో భార్య అలిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భానుదాస్‌ బుధవారం తాను నివాసముంటున్న గుడిసెలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement