
ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తచెరువు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామానికి చెందిన నరసింహులు (62)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వ్యక్తిగత పనిపై మంగళవారం కొత్తచెరువుకు వెళ్లిన ఆయన సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు నరసింహులు గతంలో లోచర్ల సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
భర్త అదృశ్యంపై ఫిర్యాదు
బెళుగుప్ప: మండల పరిధిలోని శీర్పి గ్రామానికి చెందిన తన భర్త మంగలి మహేష్ ఈనెల 20 నుంచి కనిపించడం లేదని భార్య రూప బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రాప్లోన్ రెన్యూవల్ కోసం కళ్యాణదుర్గం వెళ్లిన మహేష్.. తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాలు, బంధువులను విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బాల నరసింహులు కేసు నమోదు చేశారు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోని ఆరు విభాగాలకు ఎన్బీఏ (నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది. సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. అక్రిడిటేషన్ రావడానికి తోడ్పాటు అందించిన విభాగాధిపతులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్బీఏ గుర్తింపు గల కళాశాల జారీ చేసే సర్టిఫికెట్కు విలువ అధికంగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రమాదంలో వ్యక్తి మృతి