
నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తిటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. స్థానిక పంప్ హౌస్ వద్ద బుధవారం కార్మికుల సమావేశం జరిగింది. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్మికులు చర్చించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ క్రాంతికుమార్ను కలసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... శ్రీసత్యసాయి నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ.8 కోట్ల బకాయిలను మున్సిపాలిటీ చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపి వేశారన్నారు. ఫలితంగా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తిందని వివరించారు. అలాగే వెంగలమ్మ చెరువు పంప్ హౌస్ నుంచి 35 ఏళ్లుగా నీటి సరఫరా అగిపోయిందన్నారు. దీంతో కార్మికులకు చెల్లించాల్సిన నాలుగు నెలల వేతనాలు బకాయి పడ్డాయన్నారు.10నెలల పీఎఫ్ చెల్లించనందున కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు. మున్సిపాలిటీ బకాయిలు చెల్లించక పోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించి, కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘం అధ్యక్షుడు నరేష్, నాయకులు మధునూదన్, బాలు, శివప్రసాద్, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు