
ఉద్యోగులకు జీతాలూ లేవ్
ఉరవకొండ: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా వారి ఇంటికి చేర్చడానికి తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఆ వాహనాల డ్రైవర్లు ఎంతో భద్రంగా తల్లీబిడ్డలను తీసుకెళతారు. అలాగే రక్తహీనతతో బాధపడే గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడం, రక్తం ఎక్కించిన తరువాత ఇంటి దగ్గర దింపే అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇంతలా సేవ చేస్తున్నా వారిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత మూడు నెలలుగా జీతాలివ్వలేదు. దీంతో వారందరూ కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 24 ఉన్నాయి. మొత్తం 32 మంది డ్రైవర్లు పనిచేస్తుండగా వీరికి గత టీడీపీ హయాంలో నెలకు రూ.7,200 చొప్పున వేతనం చెల్లించేవారు. వీరి సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 8,800కు పెంచారు. అయితే, కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.